పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా… సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా… సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి… పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో నిర్వహించ నున్నారు. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా… తొలి విడతలో 152 నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. రెండో విడతలో మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ రోజు తొలి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత… ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. అయితే అప్పటివరకు క్యూలో ఉన్న ఓటర్లందరికీ తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. కీలక వివరాలు… పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడతలో 3.60 కోట్లకు పైగా ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు. తొలి విడతలో 16 జిల్లాల్లోని మొత్తం 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ జిల్లాలలో డార్జిలింగ్, కాలింపాంగ్, జల్పైగురి, అలీపుర్దువార్, కూచ్ బెహార్ , ఉత్తర దినాజ్పూర్, దక్షిణ దినాజ్పూర్, మాల్దా, ముర్షిదాబాద్, బీర్భూమ్, పశ్చిమ బర్ధమాన్, పురూలియా, బంకురా, ఝార్గ్రామ్, పశ్చిమ మేదినీపూర్, పూర్భా మేదినీపూర్ ఉన్నాయి. పోటీలో 1,478 మంది అభ్యర్థులు ఉండగా… 152 నియోజకవర్గాల్లో 44,000కు పైగా పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. బెంగాల్లో 2,407 కేంద్ర సాయుధ పోలీసు దళాల కంపెనీలకు చెందిన 2.4 లక్షలకు పైగా సిబ్బందిని మోహరించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్… తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్నవారికి కూడా ఓటు వేయడానికి అనుమతిస్తారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 4,023 మంది బరిలో ఉన్నారు. ఈ అభ్యర్థుల భవితవ్యాన్ని 5.73 కోట్లకు పైగా ఓటర్లు నిర్ణయించనున్నారు. తమిళనాడులో శాంతియుతంగా పోలింగ్ జరిగేలా చూసేందుకు ఎన్నికల సంఘం భారీ భద్రతా సిబ్బందిని మోహరించింది. బహుళ అంచెల భద్రతా ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఓటర్లు తమ ఓటు వేయడానికి పోలింగ్ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు… మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సురక్షితంగా డిపాజిట్ చేయడానికి పోలింగ్ బూత్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా చెప్పారు. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. రానున్న ఎన్నికల్లో డీఎంకే- కాంగ్రెస్ కూటమికి అన్నాడీఎంకే-బీజేపీలతో ఎన్డీయే కూటమికి మధ్య ప్రదాన పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే… తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతుందనేది కూడా చూడాల్సి ఉంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలతో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీల ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన చేపట్టనున్నారు.