అక్షర ఆయుధం: బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాలను వదిలి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఆయన ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు నితీష్ కుమార్ ప్రకటన కూడా చేశారు. తన పదవిని వదులుకుని రాజ్యసభకు వెళ్తున్నట్లు నితీష్ కుమార్ తెలిపారు. అదే సమయంలో బీహార్లో కొలువుదీరే కొత్త మంత్రివర్గానికి తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ‘‘ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిని కావాలని నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా మీతో నా సంబంధం కొనసాగుతుంది. అభివృద్ధి చెందిన బీహార్ను నిర్మించడానికి మీతో కలిసి పనిచేయాలనే నా సంకల్పం స్థిరంగా ఉంటుందని నేను మీకు పూర్తి నిజాయితీతో హామీ ఇస్తున్నాను. ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి నా పూర్తి సహకారం, మార్గదర్శకత్వం ఉంటుంది’’ అని నితీష్ కుమార్ ఎక్స్లో పోస్ట్ చేశారు.అలాగే రెండు దశాబ్దాలకు పైగా తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. బీహార్ అభివృద్దికి, తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు గతంలో పలుమార్లు కృతజ్ఞతలు తెలియజేసానని చెప్పారు. అయితే నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో… బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు కానున్నారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బీహార్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ నుంచి సీఎం ఉంటారా?, జేడీయూ నుంచి ఉంటారా? అనే ఉత్కంఠ కొనసాగుతుంది.బీహార్ తదుపరి ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు నాయకులు ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రులలో ఒకరైన సామ్రాట్ చౌదరి అత్యున్నత స్థానానికి ఎదగాలని విస్తృతంగా భావిస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి అయిన సామ్రాట్ చౌదరి… చాలా సంవత్సరాలుగా అనేక కీలక శాఖలను నిర్వహించారు. పంచాయతీ రాజ్ మంత్రిగా సేవలందించడం నుంచి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన హోం వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్నారు. తద్వారా గత కొంతకాలంగా ఆయన పరిపాలనా నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా ఉన్నారు. సామ్రాట్ చౌదరి బీహార్ డిప్యూటీ సీఎంగా పనిచేయడం ఇది రెండోసారి. ఇక, నిత్యానంద్ రాయ్ కూడా బీహార్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ప్రస్తుతం కేంద్రంలో హోం వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. జాతీయ రాజకీయాలకు వెళ్లే ముందు… నిత్యానంద్ రాయ్ బిజెపి బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు మరియు పార్టీకి బలమైన సంస్థాగత పునాదిని నిర్మించారు. హాజీపూర్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తరువాత 2015లో పార్లమెంటరీ టికెట్ను పొందారు మరియు ఉజియార్పూర్ నుండి ఎంపీగా పనిచేశారు. మరోవైపు జేడీయూ నుంచి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించవచ్చనే ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. అయితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.