సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయిల్ సరఫరా పునఃప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా ఇబ్బందిపెట్టాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీలు దిగొచ్చాయి. ఉదయం నుంచే ఆయిల్ కంపెనీలు డిస్పాట్ సెంటర్ నుంచి ఆయిల్ ట్యాంకర్లను పంపించాయి. సాయంత్రానికి పెట్రోల్ సమస్యలు తీరుతాయని సీఎంకు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో సాధారణ పరిస్థితిని తెచ్చేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు సమన్వయంతో పని చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి వెళ్లిన ఆయిల్ ట్యాంకర్లు ఈ రోజు సాయంత్రం వరకూ రిటైల్ బంకులకు చేరుకుంటాయని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు.రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారానికి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు వివరణ కోరారు. ఈ రోజు సాయంత్రానికి మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు వివరించారు. ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ స్వయంగా కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయిల్ సరఫరా జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతీ 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు, మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎటువంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెట్‌, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు నిరంతరం పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశిచారు. అనుమతులపై పునరాలోచన చేస్తాం మరోవైపు కంపెనీలు రిటైల్ ఔట్ లెట్లకు ఇంతకుముందులా క్రెడిట్ ఇవ్వడం లేదని అధికారులు తెలుపగా. ఎందుకు క్రెడిట్ నిలిపేశారని హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల ప్రతినిధులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కంపెనీలు రిటైల్ ఔట్ లెట్ల మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలన్నారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతుల విషయం పునరాలోచన చేయాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆయిల్ కంపెనీల అసంబద్ద నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందిపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల నిత్యావసరాలకు సంబంధించిన అంశంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఆయిల్ కంపెనీలకు తేల్చిచెప్పారు. గురువారమే సమస్యను గుర్తించామని అధికారులు చెప్పగా. మూడు రోజుల క్రితమే సమస్య గుర్తించినప్పుడు ఎందుకు పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తలెత్తిన తరువాత, ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తనకు నివేదికలు ఇవ్వడం కాదని ఫలితాలు చూపించాలని సిఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *