హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న 22 భారతీయ నౌకలపై కేంద్రం ప్రకటన

సాక్షి డిజిటల్ న్యూస్ : పశ్చిమాసియాలో జరుగుతున్న ఇజ్రాయెల్- అమెరికా, ఇరాన్ యుద్ధం యావత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. అంతర్జాతీయ చమురు రవాణాలో ఐదో వంతు జరిగే హర్మూజ్ జల సంధిని ఇరాన్ నియంత్రిస్తోంది. దీంతో నౌకల రవాణా స్తంభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పైపైకి వెళ్తున్నాయి. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. భారత్‌కు చెందిన 22 నౌకలు ఆ జల సంధిలో చిక్కుకున్నాయి. అందులో దాదాపు 800 మంది సిబ్బంది భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధం కారణంగా హర్మూజ్ జల సంధిలో ఆయిల్ రవాణా స్తంభించిపోయింది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జల సంధిని ఇరాన్ తన అధీనంలోకి తీసుకోవడంతో నౌకల రవాణా నిలిచిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చి, ప్రపంచం ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతోంది. ఇక, హర్మూజ్‌కు పశ్చిమా పర్షియన్ గల్ఫ్‌ వద్ద 24, తూర్పు 4 సహా భారత్‌కు చెందిన 28 నౌకలు చిక్కుకున్నాయి. ఇందులో ఆరు ఎల్పీజీ ఉన్న ట్యాంకర్లు. వీటిల్లోని 778 మంది సిబ్బంది భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నౌకలు, అందులోని సిబ్బంది భద్రత గురించి కీలక ప్రకటన చేసింది. అక్కడ ఉన్న 22 నౌకలు, వాటిల్లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపింది. ఆ ప్రాంతంలోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది. హర్మూజ్‌లో నౌకలు సురక్షిత ప్రయాణానికి సహకరించాలని ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాలతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. విదేశాంగ శాఖ ఈ ప్రయత్నాలను సమన్వయం చేస్తోంది. నౌకాయాన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ…‘‘గత 24 గంటల్లో ఆ ప్రాంతంలోని వివిధ రేవులు, ప్రదేశాల నుంచి 25 మంది భారతీయ పౌరులు స్వదేశానికి చేరుకున్నారు.. గత 24 గంటల్లో కంట్రోల్ రూమ్‌కి 125 ఫోన్ కాల్స్, 450 మెయిల్స్ వచ్చాయి.. చమురు సంస్థల షెడ్యూల్ ప్రకారం ‘శివాలిక్’, ‘నందా దేవి’ నౌకల నుంచి అన్‌లోడింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వద్ద సుమారు 2,250 చదరపు మీటర్ల అదనపు నిల్వ స్థలాన్ని ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏ పోర్టు వద్ద రద్దీ ఉన్నట్లు సమాచారం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే, దాదాపు 80,886 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్‌తో జగ్ లాడ్కీ ఆయిల్ ట్యాంకర్ గుజరాత్‌లో ముద్రా పోర్టుకు బుధవారం చేరుకుంది. హర్మూజ్ జల సంధి లో 3 లక్షల టన్నుల ఎల్పీజీలతో ఉన్న ఆరు భారతీయ నౌకలు, ఒక ఎల్‌ఎన్‌జి ట్యాంకర్, ముడి చమురుతో ఉన్న నాలుగు నౌకలు, రసాయనాలు- ఉత్పత్తులతో నిండిన ఒకటి, మూడు కంటైనర్ నౌకలు, రెండు బల్క్ క్యారియర్‌లతో సహా 22 భారతీయ నౌకలు ఉన్నాయి. మరోవైపు, యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జల సంధి ద్వారా ప్రయాణించే నౌకలు రవాణా ఛార్జీలు, బీమీ ప్రీమియంలను భారీగా పెంచేశారు. ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్న ఘర్షణతో పెరిగిన ప్రమాదాల కారణంగా, ఆపరేటర్లు కొత్త ఆర్డర్‌లను స్వీకరించడానికి వెనుకాడుతుండటంతో రవాణా ఛార్జీలు కూడా గణనీయంగా పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *