సాక్షి డిజిటల్ న్యూస్ : మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని… పేదవారికి అన్యాయం జరగదని… ఎవరి ఆస్తులు గుంజుకోవడం లేదని అన్నారు. మూసీ నది పునరుజ్జీవం ఫేజ్ -1 పై ప్రభుత్వం మూసీ ఇన్వైట్స్ పేరుతో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ‘‘మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు మన అందరి భవిష్యత్తు కోసం చేపట్టిన ప్రాజెక్టు. అందరూ సహకరిస్తేనే హైదరాబాద్ను గొప్ప అభివృద్ది చెందిన నగరంగా నిలబెట్టాలన్న ఆశయం సాధ్యమవుతుంది. ముందుకు వెళ్లడానికి సూచనలు ఇవ్వాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మూసీ చారిత్రక పరిణామాలు, ప్రాజెక్టు లక్ష్యాలు, దాని ఆవశ్యకతను వివరిస్తూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు, నిపుణులు, నిష్ణాతులు, పౌరులు తమ సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడంపై సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు వెంట మొత్తంగా 10 వేల పేద కుటుంబాలున్నాయని… ఇప్పటికే డేటా సేకరించా మని… వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిద్ధం చేశామని తెలిపారు. అయితే దూరప్రాంతాలకు వెళ్లడం వల్ల చిన్న చిన్న పనులు చేసుకునే వారు ఉపాధి కోల్పోతామని అంటున్నారని… అందుకని సమీప ప్రాంతాల్లోనే ఇండ్లు కట్టించే ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామని… పేదల్లో దుఃఖాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఏ పేదవాడికి అన్యాయం చేయదని… ఏ పేదవాడిని నిరాశ్రయులుగా చేయబోదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేదలకు నష్టం కలిగించడానికి, కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థల ఆర్థిక ప్రయోజనాల కోసమో పనిచేయడం లేదని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా నిలబెట్టాలని అనుకుంటున్నామని… ఇందులో మనమంతా భాగస్వాములంగా ఉండాలని చెప్పారు. ‘‘చరిత్రను పరిశీలిస్తే..నది పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికత విలసిల్లింది. నదులు, సముద్రం, నీటి ప్రవాహాలు ఉన్న ప్రాంతాలే అధికంగా అభివృద్ధి చెందాయి. థేమ్స్, హడ్సన్ నదులు, సింగపూర్, సియోల్, దుబాయ్, అహ్మదాబాద్ సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు… ఎన్నింటినో గమనించిన తర్వాత తెలంగాణ కూడా ఆర్థిక ప్రగతిని సాధించాలని, అభివృద్ధి నిరోధకులుగా ఉంటే భావి తరాలు క్షమించవని మూసీ రివర్ ఫ్రంట్ కార్యక్రమాన్ని చేపట్టాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 1908లో మూసీకి ఉప్పెన వచ్చి వేలాది మంది మరణించిన సందర్భంలో ఆనాటి నిజాం వరద నివారణ, జంట నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి వందేళ్ల కిందట ఒక గొప్ప విజన్తో ఉస్మాన్సాగర్, నిజాంసాగర్లను నిర్మించిన చరిత్రను విస్మరించరాదని అన్నారు. ఎంతో దూరదృష్టితో వందేళ్ల కిందట గొప్ప గొప్ప ప్రాజెక్టులు, వారసత్వ సంపదను సృష్టించి మేటి నగరంగా అందించారని చెప్పారు. అయితే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై రాజకీయ ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రాజెక్టుకు సహకరించకపోయినా పర్లేదని… కానీ అడ్డురావొద్దని అన్నారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుపై శాసనసభలో కూడా చర్చకు పెడతామని… అందరూ తమ అభిప్రాయాలు చెప్పాలని, అందరి సలహాలు స్వీకరిస్తామని అన్నారు. ప్రాజెక్టు కోసం ఎంతో కసరత్తు చేశామని… గ్లోబల్ టెండర్లు పిలిచి కన్సల్టెంట్లను నియమించామని తెలిపారు. హైదరాబాద్ నగర జనాభా ప్రస్తుతం 1.34 కోట్లుంటే, మరో 25 ఏళ్లలో 2.5 కోట్లకు చేరనుందని… ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని చెప్పారు. మూసీ కిందనున్న నల్గొండ ప్రజల గురించి కూడా ఆలోచన చేయాలని కోరారు. విపరీతమైన వ్యర్థాలు, పారిశ్రామిక కాలుష్యం, కళేబరాలతో కాలకూట విషంతో నల్గొండ ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని అన్నారు.