సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొలగింపుకు 193 మంది ఎంపీల డిమాండ్

జనం న్యూస్ : 193 మంది ఎంపీలు ఒక్కటై.. ఒక రాజ్యాంగబద్ధమైన అధికారిపై తిరుగుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అయ్యాయి. ఒక సీఈసీను పదవిలోంచి తొలగించమంటూ ఎంపీలు కోరడం భారత చరిత్రలో ఇదే తొలిసారి కాగా.. ఆయన ఆయన పదవిలోనే కొనసాగుతారా లేదా పదవిని కోల్పోతారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఈయన తొలగింపు ప్రక్రియ ఎలా సాగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. భారతదేశ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ చోటు చేసుకోని ఓ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అయ్యాయి. నిష్పాక్షికతను విస్మరించారనే ఆరోపణలతో ఆయనపై అభిశంసన నోటీసు ఇచ్చేందుకు విపక్ష ఇండియా కూటమి రంగం సిద్ధం చేసింది. లోక్‌సభకు చెందిన 130 మంది, రాజ్యసభకు చెందిన 63 మంది.. మొత్తం 193 మంది ఎంపీలు ఈ నోటీసుపై సంతకాలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసలెందుకు తొలగించాలని గొడవ చేస్తున్నారు? సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విపక్ష నేతలు ప్రధానంగా ఏడు అభియోగాలను మోపారు. అవేంటంటే.. విధుల్లో వివక్షా పూరితంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని చెబుతున్నారు. అలాగే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్) పేరుతో లక్షలాది మంది ఓట్లను అక్రమంగా తొలగించారని, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని అధికారిక ఓటర్లను జాబితా నుంచి తొలగించారని మమతా బెనర్జీ వంటి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఎన్నికల అక్రమాలపై జరుగుతున్న విచారణలను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకుంటున్నారని నోటీసులో పేర్కొన్నారు. అసలు సీఈసీ తొలగింపు ప్రక్రియ ఎలా ఉంటుంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం.. సీఈసీని తొలగించాలంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతినే అనుసరించాలి. ముఖ్యంగా లోక్‌సభలో కనీసం 100 మంది, రాజ్య సభలో 50 మంది ఎంపీల మద్దతు ఉంటేనే నోటీసులు ఇవ్వొచ్చు. ప్రస్తుతం విపక్షాల వద్ద అంతకంటే ఎక్కువే సంఖ్యాబలం ఉంది. అయితే నోటీసును స్పీకర్ లేదా చైర్మన్ అనుమతించిన తర్వాత.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక ప్రముఖ న్యాయకోవిదుడితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తారు. విచారణ సమయంలో సీఈసీ తన వాదనను వినిపించుకోవచ్చు. పార్లమెంట్ చర్చ సందర్భంగా సభ గడప వద్ద నిలబడి తనను తాను సమర్థించుకునే హక్కు ఆయనకు ఉంటుంది. సభలోని మొత్తం సభ్యుల్లో సగానికి పైగా హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు సభ్యుల మద్దతు లభిస్తేనే ఈ తీర్మానం నెగ్గుతుంది. శుక్రవారమే ఏదో ఒక సభలో సమర్పించే అవకాశం.. ఈ నోటీసును శుక్రవారం ఉభయ సభల్లో ఏదో ఒక సభలో సమర్పించే అవకాశం ఉందని సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సహా ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు దీనికి మద్దతు ప్రకటించాయి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *