పయనించే సూర్యుడు న్యూస్ : లోకసభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి గొంతు వినిపించే అవకాశం ఇవ్వకపోవడం, సభ్యులపై మూకుమ్మడి సస్పెన్షన్లే లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. అయితే పది గంటల పాటు దీనిపై సుదీర్ఘ చర్చ జరగనుండగా.. జగదాంబికా పాల్ సారథ్యం వహిస్తున్నారు. సంఖ్యాబలం పరంగా ఎన్డీయేకి ఢోకా లేకపోయినా.. ఈ తీర్మానం ద్వారా స్పీకర్ వైఖరిని ఎండగట్టాలని విపక్షాలు వ్యూహరచన చేశాయి. భారత పార్లమెంటరీ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం అయింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో మంగళవారం సభ దద్దరిల్లింది. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని అధికారికంగా సభలో ప్రవేశ పెట్టగా.. దీనిపై చర్చకు సభాపతి సుముఖత వ్యక్తం చేశారు. ఏకంగా 10 గంటల పాటు సుదీర్ఘ చర్చకు సమయం కేటాయించడంతో దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ నెలకొంది. విపక్షాల ఆగ్రహానికి కారణాలివే..! స్పీకర్ పట్ల విపక్షాలు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక బలమైన కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తగిన సమయం, అవకాశం ఇవ్వలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే విపక్షాలకు చెందిన ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం నిరంకుశ చర్యని వారు అభివర్ణించారు. కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు 118 మంది ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును విపక్షాలు స్పీకర్ కార్యాలయానికి సమర్పించాయి. ప్రత్యేక సభాపతిగా జగదాంబికా పాల్ సాధారణంగా స్పీకర్పైనే అవిశ్వాస తీర్మానం ఉన్నప్పుడు.. ఆయన సభను నడిపేందుకు అనర్హులు అవుతారు. దీంతో విపక్షాల విన్నపం మేరకు సీనియర్ ఎంపీ, చైర్ పర్సన్స్ ప్యానెల్ సభ్యుడు జగదాంబికా పాల్ను ప్రత్యేక సభాపతిగా నియమించారు. ఆయన సారథ్యంలోనే ప్రస్తుతం సభ్యుల మధ్య వాడివేడి చర్చ కొనసాగుతోంది. గెలుపెవరిది..? చర్చ ముగిసిన తర్వాత సభలో ఓటింగ్ నిర్వహించనున్నారు. తీర్మానం నెగ్గాలంటే సాధారణ మెజార్టీ అంటే 272 ఓట్లు అవసరం. ప్రస్తుతం బీజేపీ కూటమికి 293 మంది ఎంపీల మద్దతు ఉంది. కాంగ్రెస్, ఇతర పక్షాలకు కలిపి 238 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. సంఖ్యల పరంగా చూస్తే విపక్షాల తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే స్పీకర్ పని తీరును దేశం దృష్టికి తీసుకెళ్లడంలో తాము విజయం సాధించామని విపక్షాలు భావిస్తున్నాయి.