స్వీయ జనగణనలో సీఎం చంద్రబాబు నమోదు

ప్రజలకు కీలక పిలుపు!

జనం న్యూస్ : ‘ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలన్నా, మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నా వాస్తవ గణాంకాలు ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ జనగణనలో భాగస్వాములు కావాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అధికారులు అడిగే వివరాలను ప్రజలు నిర్భయంగా, ఖచ్చితంగా వెల్లడించాలని, తద్వారా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణన కార్యక్రమం ప్రారంభం అయ్యింది.గురువారం ఉదయం నుంచి ఈ జనగన కార్యక్రమంఅత్యంత ఉత్సాహంగా సాగుతోంది. ఆన్‌లైన్‌లో పలువురు స్వీయ జనగణన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం స్వయంగా స్వీయ జనగణన కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. స్వీయ జనగణనలో భాగంగా ఆయన తన వ్యక్తిగత వివరాలతో పాటు, కుటుంబ సభ్యుల సమాచారాన్ని అధికారులకు అందించి నమోదు చేయించుకున్నారు. రాష్ట్ర ప్రగతికి, భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు ఖచ్చితమైన గణాంకాలు ఎంతో కీలకమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. స్వీయ జనగణన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. se.census.gov.in వెబ్ సైట్ ద్వారా ముఖ్యమంత్రి వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. మే 1 నుంచి 30 వరకు ఇళ్ల గణన ఈ నెల 30 తేదీ వరకూ ప్రజలు స్వయంగా ఆన్ లైన్ లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మే 1 తేదీ నుంచి 30 తేదీ వరకూ ఎన్యుమరేటర్ అధికారులు ఇంటింటికీ వెళ్లి భౌతికంగా ఇళ్ల గణన ప్రక్రియను చేపడతారని తెలియచేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పౌరులందరికీ సమానంగా సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. దీని కోసం కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికల్ని రూపోందించటం అవసరమని ఈ లక్ష్య సాధనలో జనగణన కార్యక్రమం అత్యంత కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెండు దశల్లో జనగణన రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీలో జనగణన కార్యక్రమం జరుగుతోందని ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాకుండా అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. జనాభా లెక్కల కార్యక్రమం రెండు దశల్లో జరుగనుందని మొదటి దశలో ఇవాల్టి నుంచే ఇండ్ల గణన ప్రారంభమైందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *