సాక్షి డిజిటల్ న్యూస్ : సమాచార సమగ్రత పరిరక్షకులు ఐఐఎస్ అధికారులు అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.తనను కలిసిన ట్రైనీ ఐఐఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. బలాన్ని కాకుండా మేథస్సుతో చేసే సమాచార యుద్దంలో అగ్రభాగాన నిలవండి అని సూచించారు. కేంద్ర ప్రభుత్వ అభివ్రుద్ధి, సంక్షేమ ఫలాలను అట్టడుగువారికి చేరేలా సమాచార వ్యాప్తి చేయండి అని కేంద్రమంత్రి బండి సంజయ్ సూచించారు.దేశ భద్రత, సంక్షోభ సమాయాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ గందరగోళం స్రుష్టించే శక్తులను కుట్రలను తిప్పికొట్టేందుకు సమయోచిత, వాస్తవిక, బాధ్యతాయుతమైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) అధికారుల పాత్ర చాలా కీలకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఐఐఎస్ అధికారులు సమాచార మాద్యమకారులుగా మాత్రమే కాదని, సమాచార సమగ్రతకు(ఇన్ఫర్మేషన్ ఇంటెగ్రిటీ), జాతీయ ఐక్యత పరిరక్షకులుగా నిలవాలని సూచించారు. యుద్దం చేయకుండా సమాచార వ్యాప్తి ద్వారా శత్రువులను మనసులను ప్రభావితం చేయడంలో టీవీ, రేడియో సహా మీడియా సైకలాజికల్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు. బలాన్ని కాకుండా మేథస్సును ఉపయోగించి చేసే సమాచార యుద్దంలో ఐఐఎస్ అధికారులు అగ్రభాగాన నిలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. కేంద్రమంత్రితో ట్రైనీ ఐఐఎస్ అధికారుల భేటీ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) 2009, 2023, 2024 బ్యాచ్ లకు చెందిన గ్రూప్ ఏ ట్రైనీ అధికారులు ఈనెల 15 నుండి 22 వరకు అంతర్గత భద్రత, సంక్షోభ, విపత్తు కమ్యూనికేషన్, సైకాలజికల్ ఆపరేషన్స్ పై అవగాహన పెంపొందించుకునేందుకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను ఆయా ట్రైనీ అధికారులు మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా అధికారుల విద్య, కుటుంబ నేపథ్య వివరాలను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లోకి రావడానికి కారణాలపైనా ఆరా తీశారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళుతున్నాయా? లేదా? అట్టడుగునున్న అణగారిని వ్యక్తుల వరకు సంపూర్ణంగా సంక్షేమ ఫలాలు అందాలంటే ఏం చేస్తే బాగుంటుందనే అంశాలపైనా ఆరా తీశారు. ముఖ్యంగా నేటి పరిస్థితుల్లో సేవలు ఎలా మారుతున్నాయి? భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే అంశాలతోపాటు మారుమూల గ్రామాలకు సైతం సమాచారం చేరేలా కమ్యూనికేషన్ బలపడేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా వారితో చర్చించారు. కమ్యూనికేషన్ కేవలం పరిపాలన సాధనం మాత్రమే కాదు వేగంగా మారుతున్న సమాచార ప్రపంచంలో సమర్ధవంతమైన కమ్యూనికేషన్ కేవలం పరిపాలనా సాధనం మాత్రమే కాదని, జాతీయ స్థిరత్వానికి, ప్రజల విశ్వాసానికి మూలస్థంభమని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈ విషయంలో ఐఐఎస్ అధికారుల పాత్ర కీలకమని తెలిపారు. ముఖ్యంగా అంతర్గత భద్రతకు సంబంధించిన విషయానికొస్తే…మీడియా, సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదారి పట్టించే ఫేక్ సమాచారం సవాల్ విసురుతున్న నేటి తరుణంలో వాటిని అధిగమిస్తూ ప్రజలను చైతన్యం చేసేందుకు ఏం చేయాలనే దానిపై ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్, సెంట్రల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ అందించే ప్రత్యేక శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మధ్యవర్తిగా పనిచేసేలా సిద్ధం కావాలని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు.