సాక్షి డిజిటల్ న్యూస్: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సమీకృత భూభారతి పోర్టల్తో తొలి అడుగు వేస్తున్నట్లు తెలిపారు. రేపటి నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నట్లు తెలిపారు. స్మార్ట్ ఫోన్తో ఇంటినుంచే భూ సేవల లభ్యత ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను తయారు చేశామని అన్నారు. ఈ పోర్టల్ను ఈనెల 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి భూ వివాదాల పరిష్కారానికి తొలి అడుగు వేయబోతున్నామని తెలిపారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు చేర్పులు చేసి భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రేపు 5 జిల్లాల్లోప్రయోగాత్మక అమలు ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రైతు కోణంలో రూపొందించామని సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఏప్రిల్ 2నుంచి ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా జిల్లా కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇంటి నుంచే భూ సేవలు ‘గతంలో మాదిరిగా రైతులు తమ భూ సేవల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లవలసిన పనిలేకుండా తన ఇంటి నుంచే భూ సేవలు పొందేవిధంగా పోర్టల్ను రూపొందించాం’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులు తమ భూమి హద్దులు తేల్చాలని సర్వే అధికారుల చుట్టూ తిరిగేవారని…ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే భూభారతి పోర్టల్ ద్వారా పొందవచ్చన్నారు. రైతు లాగిన్ అయిన వెంటనే తనకు ఉన్న భూమి వివరాలు కనిపిస్తాయి. ఎన్నిఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు ఎంతచెల్లించాలో కనిపిస్తుంది. ఫీజు చెల్లించిన తర్వాత ఆ వివరాలు ఆ గ్రామంలో ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్ లాగిన్కు వెళుతుంది. ఆతర్వాత రెండు రోజల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తారు.