అక్షర ఆయుధం ; భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై అభిజిత్ లగ్నంలో రాములోరి కల్యాణం జరిపించారు. భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ్ మహోత్సవంకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సీతారాములు కల్యాణం వీక్షించారు.రాములోరి కల్యాణంలో భాగంగా… ముహూర్త లగ్నం సమయంలో సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచారు. శ్రీరామదాసు చేయించిన మూడు తాళిబొట్లు ఉన్న మంగళసూత్రానికి పూజలు నిర్వహించి… మూడు బొట్లు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుక ముగిసింది. భద్రాచలం ఆలయ పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఇక, రాములోరి కల్యాణం వీక్షించేందుకు భారీగా భక్తులు సైతం తరలివచ్చారు.మిథిలా స్టేడియంలో జరిగిన సీతారాముల కల్యాణ వేడుకను వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించి ఆనందపడ్డారు. మరోవైపు టీవీల్లో, సోషల్ మీడియాలో కూడా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణాన్ని వీక్షించి లక్షలాది మంది వీక్షించారు.ఇక, భద్రాచలం ఆలయ పరిసరాల్లో, మిథిలా స్టేడియం వద్ద భారీగా భద్రత చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, వీవీఐపీలతో పాటు రెండు లక్షలకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. భద్రాచలం ఆలయంతో పాటు పట్టణంలోని కీలక ప్రాంతాలను పుష్పాలతో, విద్యుద్దీపాలతో అలంకరించారు. రాములోరి కల్యాణం వీక్షించేందుకు భద్రాచలం వచ్చే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇదిలాఉంటే, భద్రాచలం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి… శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విస్తరణ కోసం తొలిదశ రూ. 351 కోట్లతో అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. ఇందులో రూ. 180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, రూ. 96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి, రూ. 75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరగాలని సూచించారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు కూడా ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.