సాక్షి డిజిటల్ న్యూస్ : పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే, రవాణాకు కీలకమైన హర్మూజ్ జల సంధి మూసివేతతో సంక్షోభం మరింత పెరిగింది. దీంతో చమురు మార్కెట్లో కల్లోలం కొనసాగుతోంది.చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో పలు దేశాలు రేషన్ విధానం అమలు చేస్తున్నాయి. ఇక, మన పొరుగు దేశం బంగ్లాదేశ్లోనూ ఆయిల్ నిల్వలు అడుగంటడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భారత్ 5 వేల టన్నుల డీజిల్ను ఆ దేశానికి పంపింది. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం మొదలైంది. పలు దేశాల్లో ఆయిల్ నిల్వలు ఖాళీ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందోననే భయాలు వెంటాడుతున్నాయి. తమపై దాడులను ఆపే వరకూ హర్మూజ్ నుంచి ఒక్క లీటర్ ఆయిల్ కూడా వెళ్లదని ఇరాన్ పునరుద్ఘాటించింది. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధ ప్రభావం పొరుగు దేశం బంగ్లాదేశ్పై కూడా పడింది. అక్కడ బంకుల్లో జనం పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశానికి భారత్ 5000 టన్నుల డీజిల్ను మంగళవారం పంపింది. పర్బాతిపూర్ సరిహద్దుల నుంచి పైప్లైన్ ద్వారా భారత్ ఆయిల్ పంపిన విషయాన్ని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ ముహమ్మద్ రెజనూర్ రహమాన్ ధ్రువీకరించారు. ‘ఒప్పందం ప్రకారం ఏడాదికి 1,80,000 టన్నుల డీజిల్ను పైప్లైన్ ద్వారా భారత్ సరఫరా చేయనుంది.. అందులో భాగంగానే 5 వేల టన్నులు ఇప్పుడు వచ్చింది’ అని తెలిపారు. ఆరు నెలల్లో 90 వేల టన్నులు దిగుమతి చేసుకోనున్నట్టు చెప్పారు. ‘ఈ రోజు 5 వేల టన్నులు వచ్చింది.. రాబోయే రెండు నెలల్లోనే 6 నెలలకు రావాల్సిన మొత్తాన్ని దిగుమతి చేసుకుంటామని ఆశిస్తున్నాం’ అని వివరించారు. ఇదిలా ఉండగా.. చమురు సంక్షోభం తలెత్తడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ దేశం చమురుపై విధించిన ఆంక్షలను సడలిస్తామని అమెరికా సంకేతాలు ఇచ్చింది.అక్రమ నిల్వల నివేదికల మధ్య స్టాక్ స్థాయిలను పర్యవేక్షించే ప్రయత్నాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం కొనసాగిస్తున్నందున భారత్ నుంచి డీజిల్ రాక మొదలైంది. వారం ప్రారంభంలో పరిస్థితిని పరిశీలించడానికి డ్రైవ్లు నిర్వహించినట్లు ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘ప్రస్తుత సంక్షోభ పరిస్థితిలో మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించే ప్రయత్నంలో కొంతమంది అక్రమంగా ఇంధనాన్ని నిల్వ చేస్తున్నారని వివిధ మీడియా సంస్థలు నివేదించాయి’ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.