పయనించే సూర్యుడు న్యూస్ : భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, వాణిజ్యపరమైన సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు విక్రమ్ దొరైస్వామిని చైనాకు భారత నూతన రాయబారిగా ఎంపిక చేసింది. ప్రస్తుతం యూకేలో భారత హైకమిషనర్గా ఉన్న ఆయన.. త్వరలోనే బీజింగ్లో బాధ్యతలు చేపట్టనున్నారు. చైనాతో నెలకొన్న ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడంలో, దౌత్యపరమైన చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో దొరైస్వామి అనుభవం భారత్కు కలిసి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పొరుగు దేశం చైనాతో దౌత్యపరమైన సంబంధాలు అత్యంత కీలకంగా మారిన తరుణంలో.. భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో భారత తదుపరి రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త విక్రమ్ కె. దొరైస్వామిని నియమిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గురువారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం చైనాలో భారత రాయబారిగా ఉన్న ప్రదీప్ కుమార్ రావత్ స్థానంలో దొరైస్వామి బాధ్యతలు తీసుకోనున్నారు. సీనియర్ దౌత్యవేత్తకు కీలక బాధ్యతలు.. 1992 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి అయిన విక్రమ్ దొరైస్వామికి దౌత్య రంగంలో అపారమైన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో భారత హైకమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు బంగ్లాదేశ్లో భారత హైకమిషనర్గా పని చేసిన కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బీజింగ్లో భారత మిషన్కు నాయకత్వం వహించే బాధ్యతను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. గత కొన్నేళ్లుగా భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. సరిహద్దు సమస్యలతో పాటు వాణిజ్య లోటు, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై రెండు దేశాల మధ్య నిరంతరం చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. దౌత్య వ్యూహాలను అమలు చేయడంలో ఆరితేరిన దొరైస్వామి నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన “త్వరలోనే బాధ్యతలు చేపడతారని” విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. భారత్తో స్నేహం కోరుకుంటున్నామని చైనా చెబుతున్న నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దొరైస్వామి నియామకం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. అనుభవజ్ఞుడైన అధికారి విక్రమ్ దొరైస్వామి తన సుదీర్ఘ కెరీర్లో విదేశీ వ్యవహారాల శాఖలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధాని కార్యాలయంలోనూ (PMO) విధులు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. అంతర్జాతీయ వేదికలపై భారత గొంతుకను బలంగా వినిపించడంలో ఆయన దిట్ట. చైనా లాంటి బలమైన దేశంతో వ్యవహరించేటప్పుడు అవసరమైన సంయమనం, వ్యూహాత్మక ఆలోచనలు ఆయనలో పుష్కలంగా ఉన్నాయని విదేశీ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ నియామకం ద్వారా చైనాతో దౌత్యపరమైన ప్రతిష్టంభనను తొలగించి, సంబంధాలను కొత్త పుంతలు తొక్కించాలని భారత్ ఆశిస్తోంది. విక్రమ్ దొరైస్వామి మాండరిన్ భాషలో డిప్లొమా చేశారు. దీని వల్ల చైనీస్ అధికారులతో మాట్లాడటానికి ఆయన భాషా సమస్య ఉండదు. గతంలో ఆయన బంగ్లాదేశ్, ఉజ్బెకిస్థాన్, సౌత్ కొరియాల్లోనూ ఆయన పని చేశారు. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఆయన వ్యవహరించిన తీరు దౌత్యవేత్తగా ఆయన సమర్థతను చాటి చెప్పింది. దొరైస్వామి నియామకం ద్వారా.. సరిహద్దు సమస్యలు, ఆర్థికపరమైన అంశాలను దౌత్యపరంగానే చర్చించాలని తాము బలంగా కోరుకుంటున్నట్లు చైనాకు భారత్ సంకేతం ఇచ్చింది.