ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది.. వడగాలుల హెచ్చరిక

* ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మరోసారి పెరిగింది. * ఊపిరి పీల్చనివ్వని వేడి.. ఈ ప్రాంతాలకు భారీ ప్రమాద సూచనలు

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మరోసారి పెరిగింది. ఏప్రిల్ 12 నుండి 16 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మరోసారి పెరిగింది. కొద్ది రోజుల క్రితం వరకు అకాల వర్షాలు, ఉరుములు, ఈదురు గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినప్పటికీ… గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 12 (ఆదివారం) నుంచి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది. ఐఎండీ తాజా అంచనాల ప్రకారం, ఏప్రిల్ 12 నుండి 16 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుంది. ఇక, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటాయి. శనివారం (ఏప్రిల్ 11) రోజున రాష్ట్రంలో అత్యధికంగా కడప జిల్లా పొట్టిపాడులో 44.7°C, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3°C గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రతపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 200 మండలాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఆదివారం (ఏప్రిల్ 12) రోజున రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని పలు మండలాల్లో తీవ్ర వడగాలపులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ, హిర మండలాల్లో… విజయనగరం జిల్లాలోని సంతకవిటి, వంగర మండలాల్లో… పార్వతీపురంమన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కొమరాడ,కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో… పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో… ఏలూరు జిల్లాలోని కుక్కునూరు,వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్‌డీ ఎంఏఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని 35 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాలులు పెరగడంతో ప్రజలకు ఏపీఎస్‌డీఎంఏ కీలక సూచనలు చేసింది. ఎండ తీవ్రత ఉన్న సమయంలో బయటకు వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయటకు వెళ్లేప్పుడు తలకి టోపీ లేదా రుమాలు ధరించాలని సూచించింది. అలాగే, తెలుపు రంగు కాటన్ వస్త్రాలు, సన్ గ్లాసెస్ ఉపయోగించాలని కోరింది. మంచినీరు ఎక్కువగా తాగాలని సూచించారు. గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఉన్నవారు ఎండలో తిరగవద్దని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *