బెంగాల్ సభలో యువత, ఉద్యోగాలపై మోదీ హామీలు

* యువత, ఉద్యోగులకు మోదీ గుడ్‌న్యూస్..! బెంగాల్ సభలో భారీ హామీలు

జనం న్యూస్ : బెంగాల్‌లోని బ్యారక్‌పూర్‌లో ర్యాలీలో నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మే 4న వెలువడనున్న ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘనవిజయం సాధిస్తుందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం చివరి దశకు చేరుకుంది. రెండో దశ పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో, రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సోమవారం బ్యారక్‌పూర్‌లో నిర్వహించిన భారీ ‘విజయ సంకల్ప’ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, మే 4న వెలువడనున్న ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘనవిజయం సాధిస్తుందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగాల్ గడ్డపై అడుగుపెట్టిన ప్రతిచోటా ప్రజల మార్పు కోరుకుంటున్నారని, ఆ సంకేతాలే బీజేపీ విజయాన్ని ఖరారు చేస్తున్నాయని ఆయన ధీమాగా చెప్పారు. ప్రధాని తన ప్రసంగంలో బెంగాల్‌తో తనకున్న ఆధ్యాత్మిక, భావోద్వేగ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “బెంగాల్ అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు, అది నా ఆధ్యాత్మిక ప్రయాణానికి శక్తి కేంద్రం. ఇక్కడి మహనీయుల ఆశీస్సులు, ప్రజల అపారమైన ప్రేమ నన్ను ఎప్పుడూ ముందుకు నడిపిస్తాయి” అని ఆయన పేర్కొన్నారు. బెంగాల్ గడ్డపై తనకు కలిగిన అనుభవాలు తనపై ఉన్న గొప్ప ఆశీర్వాదంగా భావిస్తానని, ఇక్కడి సంస్కృతి పట్ల తనకు ఎంతో భక్తి ఉందని భావోద్వేగంతో చెప్పారు. ఈ ఎన్నికల ప్రచారంలో బ్యారక్‌పూర్ ర్యాలీ తనకు చివరి బహిరంగ సభ అని వెల్లడిస్తూ, ఫలితాల అనంతరం రాష్ట్రంలో జరగబోయే బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను మళ్లీ వస్తానని ప్రధాని స్పష్టం చేశారు. బెంగాల్ ప్రజలు ప్రస్తుతం భద్రత, ఉపాధి అవకాశాలు, అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నారని, అధికార టీఎంసీ ప్రభుత్వం ఆ లక్ష్యాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. యువత మరియు ఉద్యోగుల కోసం మోదీ పలు వరాలు ప్రకటించారు. మే 4న బీజేపీ అధికారంలోకి రాగానే, ప్రభుత్వ నియామకాలను పారదర్శకంగా, షెడ్యూల్ ప్రకారం చేపడతామని హామీ ఇచ్చారు. ఉద్యోగ మేళాల ద్వారా నియామక పత్రాలను యువతకు నేరుగా అందజేస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను త్వరగా భర్తీ చేయడంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు టీఎంసీ భయం నుంచి విముక్తి కల్పిస్తామని, వారికి 7వ వేతన సంఘం (7th Pay Commission) ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందిస్తామని వాగ్దానం చేశారు. డిజిటల్ విప్లవంలో బెంగాల్ యువతను భాగస్వామ్యం చేసేందుకు ‘సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ’ను విస్తరిస్తామని మోదీ తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో ‘కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను’ ఏర్పాటు చేయడం ద్వారా కొత్త తరం సృజనాత్మకతకు అండగా ఉంటామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం 125 రోజుల పనిదినాలకు హామీ ఇచ్చారు. అలాగే పీఎం విశ్వకర్మ, పీఎం సంపద వంటి కేంద్ర పథకాలను రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, నగరాల్లోని వీధి వ్యాపారులకు పీఎం స్వానిధి పథకం ద్వారా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తామని ఆయన వివరించారు. ప్రజలు తనకు ఇచ్చే లేఖలు, గీసిన చిత్రపటాల గురించి చెబుతూ ప్రధాని సున్నితమైన విషయాలను పంచుకున్నారు. “ర్యాలీలు ముగిశాక, రాత్రిపూట నేను ఒంటరిగా కూర్చుని మీరు ఇచ్చిన చిత్రపటాలను జాగ్రత్తగా చూస్తాను. మీ సందేశాలను చదువుతాను. అందులో మీ బాధ, నాపై మీకు ఉన్న ఆశీస్సులు నాకు స్పష్టంగా కనిపిస్తాయి. నా స్పందనలను కూడా వాటికి అనుగుణంగా నమోదు చేసుకుంటాను” అని ఆయన అన్నారు. మీరే నా కుటుంబం అని, దేశవ్యాప్త పర్యటనల్లో ప్రజల మధ్యే తనకు సౌకర్యం, శాంతి లభిస్తాయని చెప్పారు. రాజకీయ సభలకు ముందు ప్రధాని కోల్‌కతాలోని 300 ఏళ్ల పురాతనమైన ‘తంతానియా కాళిబారి’ ఆలయాన్ని సందర్శించి కాళీమాత ఆశీర్వాదం తీసుకున్నారు. 1703లో స్థాపించబడిన ఈ ఆలయం కోల్‌కతా నగరం అభివృద్ధి చెందకముందు నుంచే ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. రామకృష్ణ పరమహంస వంటి మహనీయులు ఇక్కడ సిద్ధేశ్వరి మాతను పూజించేవారని చరిత్ర చెబుతోంది. అటువంటి పవిత్ర స్థలంలో ప్రార్థనలు చేయడం తనపై ఉన్న జగన్మాత ఆశీర్వాదమని మోదీ భావించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సరళిని గమనిస్తే, మొదటి దశలో రికార్డు స్థాయిలో 91.78 శాతం ఓటింగ్ నమోదైంది. ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ ప్రసంగం మరియు ఆయన ప్రకటించిన హామీలు బెంగాల్ ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *