జనం న్యూస్ : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పారిశ్రామిక వేత్తలకు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. పారిశ్రామిక వేత్తలను బెదిరించడంతో కంపెనీలు తరలిపోతున్నాయని చెప్పుకొచ్చారు. అల్ట్రాటెక్ ఫ్యాక్టరీపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ప్రతీ పరిశ్రమ వద్ద కూటమి ఎమ్మెల్యేలు కప్పం వసూళ్లు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, కూటమి ప్రభుత్వ విధానాల వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ఆక్షేపించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించడం, కప్పం కట్టాలంటూ హుకుం జారీ చేయడం, అనవసర అడ్డంకులు సృష్టించడం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు భద్రత లేకుండా పోయిందని, ఈ పరిస్థితుల్లో కొత్త పరిశ్రమలు రాష్ట్రంలోకి రావడం అసాధ్యమని తేల్చి చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వ పెద్దలు అదే పనిగా గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన టీజేఆర్ సుధాకర్బాబు ఆక్షేపించారు. పరిశ్రమలకూ విస్తరించిన రెడ్బుక్ ‘రాష్ట్రంలో ఇప్పుడు రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, వేధింపులు, రాజకీయ కక్షసాధింపు చర్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు’అని మాజీఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు.‘ఇప్పుడు పరిశ్రమలపైనా బెదిరింపులు మొదలయ్యాయి. ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న పరిశ్రమలు సక్రమంగా నడవాలన్నా, కొత్తగా పరిశ్రమలు పెట్టాలన్నా కూటమి నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారు’అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు దోపిడీలో పోటీ పడుతున్నారు. అలాంటి వారిని మందలించాల్సిన సీఎం, స్వయంగా వారిని కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తున్నారు’అని టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు.‘వైయస్ఆర్ జిల్లా చిల్లంకూరులోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రెచ్చిపోయారు. ముఖ్యమంత్రిని కలిసిన తరువాత తన అనుచరులను పంపించి కార్మికులను అడ్డుకోవడం, ముడి సరుకులు తీసుకెళ్లే వాహనాలను నిలిపివేయడం, ఆర్టీవో అధికారులను ఉపయోగించి వాహనాలను అడ్డుకోవడం వంటి చర్యలకు దిగారు. ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీలో 89 శాతం స్థానికులే పనిచేస్తున్నారని అధికారులే నివేదిక ఇచ్చారు’అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.‘కాలుష్య నియంత్రణ కూడా సక్రమంగా ఉందని తేలింది. అయినా కూడా వాటా కోసం బెదిరింపులు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ఆశీస్సులతోనే వాటా కోసం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరింపులకు పాల్పడుతూ పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి తరిమివేసేందుకు యముడిలా వెంట పడుతున్నాడు’అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలపై అక్రమ కేసులు, బెదిరింపులు ‘గతంలో వికాట్ పరిశ్రమ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అక్రమ కేసులో ఇరికించడానికి ప్రయత్నించారు. ఒక సినీ నటిని అడ్డం పెట్టుకుని సజ్జన్ జిందాల్ను బెదిరించడంతో ఆ పరిశ్రమ మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఇది రాష్ట్రానికి నష్టం కాదా? తాడిపత్రిలో ఎల్ అండ్ టీ సిమెంట్ ఫ్యాక్టరీ, గండికోట వద్ద ఆదానీ హైడ్రోపవర్ ప్రాజెక్ట్, కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, పల్నాడు భవ్య సిమెంట్స్, శ్రీకాకుళం ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కూటమి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని కప్పాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ లారీకి డబ్బులు ఇవ్వాలని, కాంట్రాక్టులు తమవారికే ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రతి సిమెంట్ బ్యాగుకు కప్పం కట్టాలనే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ విధంగా పారిశ్రామికవేత్తలను వేధిస్తే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయి?’అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు నిలదీశారు.