పయనించే సూర్యుడు న్యూస్ : పర్యాటక వీసాపై భారత్కు వచ్చిన అమెరికన్, ఉక్రెయిన్ పౌరులు ఈశాన్య రాష్ట్రం మీదుగా మాయన్మార్కు వెళ్లి.. అక్కడ సాయుధ మూకలకు డ్రోన్ వినియోగంలో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ ప్రయత్నాన్ని ఎన్ఐఏ భగ్నం చేసింది. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ అంశంపై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో అమెరికా జాతీయుడు కీలకంగా మారినట్టు అధికారులు తెలిపారు. అతడు ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమని చెబుతున్నారు. మయన్మార్లోని సాయుధ సమూహాలకు, దేశంలోని కొన్ని నిషేధిత సంస్థలకు డ్రోన్ శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో భారత్ గుండా అక్రమంగా మయన్మార్లోకి ప్రవేశానికి ప్రయత్నించిన అమెరికన్ సహా ఏడుగురిని అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఈ దర్యాప్తులో అమెరికా పౌరుడు మాథ్యూ వాన్డైన్ కీలకంగా మారాడు. డ్రోన్ యుద్ధ శిక్షణ, అక్రమంగా సరిహద్దులు దాటడాలు, ఈశాన్య ప్రాంతానికి సమీపంలో పనిచేపే సాయుధ గ్రూపులతో సంబంధాలున్నాయనే ఆరోపణలకు సంబంధించిన కేసులో అమెరికా పౌరుడు మాథ్యు వాన్డైక్తో పాటు మరో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. మాథ్యూ వాన్డైక్ ఎవరు? మాథ్యూ ఆరోన్ వాన్డైక్ తనను తాను ఒక మిలటరీ విశ్లేషకుడిగా, వార్ జర్నలిస్ట్గా, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా చెప్పుకుంటారు. 2011లో లిబియా అంతర్యుద్ధం సమయంలో రెబల్స్తో చేతులు కలిపి జైలుకు వెళ్లినప్పుడు మొదటిసారి మాథ్యూ పేరు అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చింది. లిబియా నుంచి విడుదలైన తర్వాత ‘సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్’ (SOLI) అనే సంస్థను వాన్డైక్ స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రాంతాలలో ఉన్న స్థానిక సాయుధ గ్రూపులకు సైనిక శిక్షణ, వ్యూహాత్మక సలహాలను అందిస్తుంది.వాన్డైక్ను కోల్కతాలో అరెస్టు చేయగా.. లక్నో, ఢిల్లీలో ముగ్గురు చొప్పున ఉక్రెయిన్ పౌరులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఏడుగురినీ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచి, 15 రోజుల కస్టడీకి కోరారు. కోర్టు 11 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అనుమతించింది. ఎన్ఐఏ వర్గాల ప్రకారం.. 14 మంది ఉక్రెయిన్ జాతీయులు వేర్వేరు తేదీలలో పర్యాటక వీసాలపై భారత్లోని ప్రవేశించారు. విమానంలో గౌహతికి వెళ్లి.. అక్కడ నుంచి అవసరమైన పత్రాలు లేకుండా మిజోరాం మీదుగా మయన్మార్లోకి ప్రవేశించారు. ఈఏజీలు (EAGs) అనే సాయుధ మూకలకు డ్రోన్ యుద్ధ శిక్షణను ఇవ్వడానికే అక్కడకు వెళ్లినట్టు గుర్తించారు. వీరు పెద్ద మొత్తంలో డ్రోన్లను ఐరోపా నుంచి భారతదేశం మీదుగా మయన్మార్లోకి దిగుమతి చేసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఐఏ వర్గాల సమాచారం ప్రకారం.. మయన్మార్లో చురుకుగా ఉన్న అనేక సాయుధ గ్రూప్లు, భారత్లో నిషేధించిన సంస్థలతోనూ వీరికి సంబంధాలు ఉన్నాయి. ఆ గ్రూప్లకు ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, శిక్షణను అందిస్తున్నాయని అనుమానిస్తున్నారు. దీనివల్ల జాతీయ భద్రతపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఈ నెట్వర్క్కు భారతదేశంలో ఏవైనా స్థానిక నిషేధిత వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయా? డ్రోన్లను భారత భూభాగం గుండా ఎలా మళ్లించారు అనేది? ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.