మహిళా రిజర్వేషన్ల చట్టానికి గ్రీన్ సిగ్నల్

అధికారిక నోటిఫికేషన్ విడుదల

అక్షర ఆయుధం ; మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే ‘‘మహిళా రిజర్వేషన్ చట్టం – 2023’’ గురువారం (ఏప్రిల్ 16) నుంచి అమలులోకి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. నారీ శక్తి వందన్ అధినియం పేరుతో పిలుస్తున్న ఈ చట్టాన్ని పార్లమెంట్ 2023లోనే ఆమోదించింది. అయితే ఈ చట్టం ప్రకారం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లను 2029 నుంచి అమలు చేసేందుకు వీలుగా గురువారం రోజున పార్లమెంట్‌ ముందుకు సంబంధిత సవరణ బిల్లులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు మహిళా రిజర్వేషన్ల చట్టం-2023 గురువారం నుంచి అమల్లోకి వచ్చిందంటూ కేంద్రం నుంచి నోటిఫికేషన్ వెలువడటం గమనార్హం. ‘‘రాజ్యాంగ (106వ సవరణ) చట్టం, 2023లోని సెక్షన్ 1, ఉప-సెక్షన్ (2) ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ… సదరు చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీగా 2026 ఏప్రిల్ 16వ తేదీని కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా నిర్ణయిస్తోంది’’ అని ఆ నోటిఫికేషన్‌లో కేంద్ర న్యాయ శాఖ పేర్కొంది. ఈ నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ… ప్రస్తుత సభలో మాత్రం ఈ రిజర్వేషన్‌ను అమలు చేయడం సాధ్యం కాదని ఒక అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అలాగే, తదుపరి జనాభా లెక్కల (Census) ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయగలమని ఆ అధికారి పేర్కొన్నారు. చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించడానికి సాంకేతిక కారణాలున్నాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్ చట్టం-2023 విషయానికి వస్తే… ఈ చట్టం 2027 జనాభా లెక్కల తర్వాత జరిగే నియోజకవర్గాలతో ముడిపడి ఉంది. తదుపరి జన గణన అంటే 2027 తర్వాత…. 2034 నుంచి ఇది అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. 2029లోనే మహిళా రిజర్వేషన్‌ను అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై ప్రస్తుతం లోక్‌సభలో చర్చ జరుగుతోంది. ఆ మూడు బిల్లులు… రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026. మహిళలు రిజర్వేషన్ కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నామని కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పేర్కొంది. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించడానికి, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లులను ఎన్డీయే నాయకులు సమర్ధించారు. పార్లమెంట్ వేదికగా నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించారు. నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లు దేశానికి సరికొత్త దశను, దిశను నిర్దేశిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకం అని….వారికి తగిన అవకాశం కల్పిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు. వికసిత్ భారత్ అంటే కేవలం రోడ్లు, రైళ్లు, భవనాలు వంటి మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని.. అన్ని వర్గాల, అన్ని రంగాల ప్రజల సమగ్ర అభివృద్ధే అసలైన వికసిత్ భారత్ అని మోదీ పేర్కొన్నారు. అయితే ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో అనుసరిస్తున్న విధానం దేశ సమాఖ్య, ప్రజాస్వామ్య స్వరూపాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *