జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్లో భూములు ఇస్తున్న రైతులకు రాష్ట్ర మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్లో భూములు ఇస్తున్న రైతులకు రాష్ట్ర మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇస్తున్న రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు నిధులు జమ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి నారాయణ శనివారం రాజధాని అమరావతిలో జరుగుతున్న రెండో విడత ల్యాండ్ పూలింగ్పై ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్, సీఆర్డీయే కమిషనర్ విజయరామరాజు, ఇతర అధికారులతో కలసి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. అదేసమయంలో భూములిచ్చిన రైతులకు మే 1 నుంచి కౌలు నిధులు అందజేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఎంజాయ్మెంట్ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి నారాయణ సూచించారు. రాజధానిలో FSI(floor space index) పెంపుపై కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. లెగసీ వేస్ట్, ఫ్రెష్ వేస్ట్ నిర్వహణ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించి ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని మంత్రి నారాయణ సూచించారు. ఇక, రాజధాని అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణకు సహకరించిన రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని కోసం భూములు త్యాగం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. రెండో విడత భూ సమీకరణపై రాజధాని రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు హామీల వర్షం కురిపించారు. రెండో విడత భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కౌలును ప్రకటించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అలాగే కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీకి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. అంతేకాదు ఏడాదికి రూ.3 వేలు చొప్పున కౌలు పెంచేందుకు అంగీకరించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులెవరికీ అన్యాయం జరగదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ భూముల్లో ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించే బాధ్యత తనదని, రైతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారి భూ సమీకరణ ప్రక్రియను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదనే చట్టబద్దత కల్పించామని రైతులకు వివరించారు.