బెంగాల్‌లో పోలింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు…

పోలింగ్ ప్రక్రియలో అంతరాయం… బాంబు దాడులతో ఉద్రిక్త పరిస్థితి

పయనించే సూర్యుడు న్యూస్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. అయితే పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల హింస చెలరేగింది. ముర్షిదాబాద్ జిల్లాలోని నౌదాలో గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబు విసరడంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. నాటు బాంబులు విసిరిన ఘటనలో పలువురు గాయపడ్డారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే పోలింగ్ జరుగుతున్న సమయంలో నాటు బాంబుల పేలుడు సంభవించడంతో... ఆ ప్రాంతంలోని ఓటర్లు, స్థానికులలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన తర్వాత భద్రత అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నాటు బాంబులతో దాడి చేసినవారిని గుర్తించేందుకు ప్రస్తుతం గాలింపు కొనసాగుతుంది. ఇక, ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై టీఎంపీ అభ్యర్థి షహీనా ముంతాజ్ ఖాన్ మాట్లాడుతూ... ‘‘ఇది నిజంగా చాలా దారుణమైన ఘటన, నేను అక్కడే ఉన్నాను... దీని వెనుక ఎవరున్నారో నాకు ఇంకా తెలియదు’’ అని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత ముర్షిదాబాద్‌లోని నౌదాలో ఏజేయూపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఏయూజేపీ వ్యవస్థాపకుడు హుమాయున్ కబీర్‌ ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హుమాయున్ కబీర్ మాట్లాడుతూ... ‘‘ఎన్నికలు శాంతియుతంగా జరగాలి. ఎన్నికలు శాంతియుతంగా జరిగితే ఎటువంటి సమస్య ఉండదు. కానీ పోలింగ్ బూత్‌ల వద్ద టీఎంసీ కార్యకర్తలు పోలీసులతో కలిసి గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వారు డబ్బులు ఇచ్చి, అధికారులతో కుమ్మక్కై పరిస్థితులను ప్రభావితం చేస్తున్నారు. బూత్‌ల లోపల పరిస్థితులు బాగానే ఉండవచ్చు... కానీ బయట ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు, రాత్రంతా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు జరగకూడదు. వీటిపై కేంద్రం ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్చ చేశారు. ఇక, హరిశ్చంద్రపూర్‌లోని బంగ్రువా గ్రామంలోని 200, 201 బూత్‌ల సమీపంలో ఉన్న టీఎంసీ క్యాంప్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న హింస, బూత్ క్యాప్చరింగ్, ఘర్షణలకు సంబంధించిన పలు ఘటనలను భారత ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించింది ఇదిలాఉంటే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో నిర్వహించనున్నారు. బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా... తొలి విడతలో 152 నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. రెండో విడతలో మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ రోజు తొలి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత... ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. అయితే అప్పటివరకు క్యూలో ఉన్న ఓటర్లందరికీ తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు.