మహిళా బిల్లుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం.

అడ్డుకున్న పార్టీలకు డిపాజిట్ కట్ హెచ్చరిక!

జనం న్యూస్ :మహిళలు చట్ట సభలకు వస్తే న్యాయం జరుగుతుందనే ఈ సవరణ బిల్లు వచ్చింది. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా బిల్లును అడ్డుకున్నారు. ఆ పార్టీలు చేసిన ద్రోహానికి డిపాజిట్ కూడా రాకుండా చేయాలి. ఆడబిడ్డలు పైకి వస్తే చూడలేకే ఈ బిల్లును అడ్డుకున్నారు ఈ వ్యవహారంపై ప్రతీ ఒక్కరిని చైతన్యం చేసేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం’అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ‘పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటం ద్వారా జాతికి ద్రోహం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు మహిళలకు అన్యాయం చేశాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా నిడదవోలులో మహిళలు, జనసేన, బీజేపీ నేతలతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు రామానాయుడు, కందుల దుర్గేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, పలువురు నేతలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళలతో కలిసి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. అంతేకాదు స్వయంగా ప్లకార్డులు పట్టుకుని విపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నిన్నటి రోజు ఓ బ్లాక్ డే. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని, సుదీర్ఘ కల సాకారం అవుతుందని అందరం భావించాం. పార్లమెంట్, అసెంబ్లీలోనూ 33 శాతం మంది మహిళల్ని ప్రజాప్రతినిధులుగా చూస్తామని అనుకున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అజెండా కోసం ఈ దుర్మార్గం చేశాయి ‘మహిళల్ని గౌరవించటం భారత సంస్కృతిలో భాగం. ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలుంటారని మన నానుడి. నిన్న పార్లమెంటులో దానికి భిన్నంగా జరిగింది. అందుకు నిరసనగా నిడుదవోలులో ఎన్డీఏ పక్షాలు నిరసన ర్యాలీ చేపట్టాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు.‘మహిళలంతా బయటకు వచ్చి నిరసన తెలిజేయాలని పిలుపు ఇస్తున్నాను. దక్షిణాదికి, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని, హోంమంత్రి హామీ ఇచ్చారు. 50 శాతం మేర సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెప్పారు. ఏపీలో కూడా 50 శాతం మేర సీట్లు పెరుగేవి. కానీ ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అజెండా కోసం ఈ దుర్మార్గం చేశాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పార్లమెంట్‌లో జరిగిన విద్రోహాన్ని ప్రతీ ఇంటికీ తీసుకెళ్తాం ‘దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాం. దీనిని అడ్డుకోవటం క్షమించరాని నేరం. ఆడబిడ్డలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలకు ఇంత చులకనా?’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ‘నిన్న జరిగిన విద్రోహాన్ని ప్రతీ ఇంటికీ తీసుకెళ్తాం. ఇవాళ చేపట్టిన నిరసన ఆరంభం మాత్రమే. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాట్లాడాను. ఎన్డీఏ పక్షాలతో పాటు ఇతర పార్టీలు కూడా కలిసి రావాలి. మహిళలను ఓటు అడిగే పార్టీలు మహిళా సాధికారతను అడ్డుకుంటాయా?’అని సీఎం చంద్రబాబు నాయుడు నిలదీశారు. ‘2017లో టీడీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బిల్లు కూడా తీసుకు రాలేకపోయారు. 2023లో బిల్లు ప్రవేశపెట్టినా దీనిని అమలు చేసే నిబంధన పెట్టారు. 2029లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే సవరణ బిల్లు తీసుకువచ్చారు. కావాలనే కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలన్నీ ఈ బిల్లుకు 2/3 మంది సభ్యుల మద్దతు రాకుండా అడ్డుకున్నాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసేలా వ్యవహరించారు ‘దక్షిణాదికి, ఉత్తరాది రాష్ట్రాలకు ఆన్యాయం జరుగుతుందని ఏవేవో ఆరోపణలు చేసి సాకులు చెప్పారు. లేని పోని సాకులతో బిల్లు వీగిపోయేలా చేయటం శోచనీయం. ప్రజలు ఎన్నుకుంటేనే చట్టసభల్లోకి వచ్చిన వారు మహిళలకు ద్రోహం చేయటం సరికాదు’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలు ఏ రంగంలో అయినా సమర్ధవంతంగా పనిచేస్తున్నారు. అలాంటి మహిళలు చట్ట సభలకు వస్తే న్యాయం జరుగుతుందనే ఈ సవరణ బిల్లు వచ్చింది. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా బిల్లును అడ్డుకున్నారు. ఆ పార్టీలు చేసిన ద్రోహానికి డిపాజిట్ కూడా రాకుండా చేయాలి. ఆడబిడ్డలు పైకి వస్తే చూడలేకే ఈ బిల్లును అడ్డుకున్నారు ఈ వ్యవహారంపై ప్రతీ ఒక్కరిని చైతన్యం చేసేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం’అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మహిళల పట్ల కాంగ్రెస్ ద్రోహానికి పాల్పడింది ‘చట్టసభల్లో మహిళల కోసం రిజర్వేషన్లు తీసుకురావాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు పార్లమెంటులో అడ్డుకున్నాయి. రిజర్వేషన్ల బిల్లును ఓడించి మహిళల పట్ల ద్రోహానికి పాల్పడ్డాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఆడబిడ్డలకు న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. మహిళా యూనివర్సిటీ పెట్టి విద్యోన్నతికి కృషి చేశారు’అని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ‘డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించేలా మహిళాభ్యున్నతికి మేం కృషి చేశాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.