
అక్షర ఆయుధం ; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం (ఏప్రిల్ 14) రోజున జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్, తదితర నాయకులకు లేఖ రాశారు. ఇందుకు సంబంధఇంచిన వివరాలు ఇలా ఉన్నాయి..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం (ఏప్రిల్ 14) రోజున జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులకు లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’కు పార్లమెంట్లో మద్దతుపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అన్నీ మద్దతు పలకాలని కోరారు. 2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు చేసేలా తీసుకువస్తున్న ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని లేఖలోప్రస్తావించారు. మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని విజ్ఞప్తి చేశారు. ''భారత ప్రజాస్వామ్యంలో ఏప్రిల్ 16, 2026 ఒక చారిత్రాత్మక, ఆనందకరమైన రోజుగా నిలుస్తుంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు బాటలువేసే 'నారీ శక్తి వందన్ అధినియం' సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ముందుకు రానుండటంతో దశాబ్దాల కల నిజం అవుతోంది. భారత ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా నిలిచేలా, సమానత్వం సాధించేందుకు ఇది గొప్ప ముందడుగు.‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ ఎక్కడ మహిళలను గౌరవిస్తారో...అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన భారతీయ ధర్మం చెబుతోంది. దీనికి నిదర్శనమే నారీ శక్తి వందన్ అధినియం. చట్ట సభల్లో మన ఆడబిడ్డలకు 33 శాతం రిజర్వేషన్లు 2029 నుంచే అమల్లోకి వచ్చేలా చట్ట సవరణకు కేంద్రం సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం ఒక గొప్ప ఆలోచనగా నేను భావిస్తున్నాను. ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా చట్టసభల్లో మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించడం ప్రతీ భారతీయుడు గర్వించే సందర్భం. మహిళా సాధికారత దిశగా మనం చేస్తున్న ఆలోచనలు సాకారం అవుతుండటం అభినందనీయం. ‘నారీ శక్తీ వందన్ అధినియం' సవరణకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, మహిళామూర్తుల తరపున గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి నిర్ణయం....రేపటి నూతన రాజకీయ పంథాకు సాధికారతకు నాంది పలుకుతోంది.ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుందని మొదటి నుంచీ నేను బలంగా నమ్ముతాను. మహిళలకు సముచిత స్థానంతోనే సమాజ అభివృద్ధి. రాష్ట్ర, దేశ పురోగతిలో మహిళలు కీలక పాత్ర పోషించాలన్నది నా అభిప్రాయం. విద్య, వైద్యం, పరిశోధనలు, టెక్నాలజీ, క్రీడలు, రక్షణ, పారిశ్రామిక, వాణిజ్య, సేవా రంగాల్లో మహిళలు చూపుతున్న ప్రభావం అసామాన్యం. కఠోర శ్రమ, కర్తవ్య దీక్షతో నేడు ప్రతీ రంగంలోనూ మహిళలు తమ ప్రతిభ నిరూపించుకుంటున్నారు.పార్లమెంట్తో పాటు రాష్ట్ర విధాన సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై దశాబ్దాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఒకే తాటిపైకి వచ్చి మద్దతు పలికారు. ఆ రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ముఖ్యమైన మైలురాయిగా నేను భావిస్తున్నాను. మహిళా రిజర్వేషన్ బిల్లుపై విస్తృతంగా చర్చలు జరిగాయి. త్వరితగతిన ఈ చారిత్రక చట్టం అమల్లోకి రావాలన్న ఏకాభిప్రాయం కూడా నాడు వ్యక్తమైంది. ప్రధానమంత్రి నాయకత్వంలో మహిళా రిజర్వేషన్లపై నిపుణులు, భాగస్వాములు, రాజకీయ పార్టీల నుంచి ప్రజాస్వామ్యయుతంగా అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 2029లో జరిగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు కావాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షకు మనందరం మద్దతు పలుకుదాం. మహిళా రిజర్వేషన్ పై అంతా ఒకే స్వరం వినిపించాలని ఆడబిడ్డల తరుపున బాధ్యతతో ఈ లేఖ రాస్తున్నాను. అన్ని రాజకీయ పార్టీలు, పార్లమెంటు సభ్యులు ఏకగ్రీవంగా ఇందుకు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. మన ఇంటి ఆడబిడ్డలను, మన దేశ మహిళలను గౌరవించుకునే ఈ అవకాశాన్ని మనందరం అదృష్టంగా భావిద్దాం. ఈ పవిత్ర ఘట్టంలో భాగస్వామి అయ్యే సందర్భాన్ని ఎవరూ వదులుకోవద్దు. చట్టసభల్లో మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించే చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు మనస్ఫూర్తిగా మద్దతు పలకాలని కోరుతున్నాను. భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలికే గొప్ప క్షణాలకు 140 కోట్ల మంది భారతీయులు సిద్ధంగా ఉండాలి. ఈ చట్టం రాజకీయాలకు అతీతం...ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయం. ప్రతీ పార్టీ, ప్రతీ ఎంపీ ఈ చారిత్రాత్మక నిర్ణయంలో తమ ముద్ర వేయాలి. 'నారీ శక్తి వందన్ అధినియం’ అమలుపరిచే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీగారిని, కేంద్ర ప్రభుత్వాన్ని సమిష్టిగా బలపరుద్దాం అని విజ్ఞప్తి చేస్తున్నాను. 'నారీ శక్తి వందన్ అధినియం' మహిళా సాధికారతతో పాటు దేశ ఉన్నతికి దోహదపడుతుంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చడంలో ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను’’ అని సీఎం చంద్రబాబు నాయుడు ఆ లేఖలో పేర్కొన్నారు.