
సాక్షి డిజిటల్ న్యూస్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం రోజున మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ గూటికి చేరతారనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే గురువారం (ఏప్రిల్ 9) రోజున కీలక పరిణామం చోటుచేసుకోనుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందిగా కేటీఆర్ ఆహ్వానించనున్నారు. కేటీఆర్ ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం రోజున కేటీఆర్ ఉమ్మడి కరీంనర్ జిల్లాలో పర్యటించనున్నారు. కేటీఆర్ గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు కరీంనగర్లోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కలువనున్నారు. అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి జగిత్యాలకు వెళ్లనున్నారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపిన కేటీఆర్... రేపు స్వయంగా కలిసి ఆయనను బీఆర్ఎస్లోకి ఆహ్వానించనున్నారు. ఇక, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డి మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. రాజీనామా ప్రకటన వెలువడగానే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి ఏఐసీసీ దూతల వరకు వెళ్లి బుజ్జగించినప్పటికీ ఫలించలేదు. చివరకు మార్చి 25న మాజీమంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటటించారు. ఈ సందర్భగా రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. నాలుగు దశాబ్ధాల కాలంలో కాంగ్రెస్ పార్టీ తనకు పలు అవకాశాలు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను లేఖలో జీవన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలను 2024 అక్టోబర్ 24 కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నాడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ, భవిష్యత్ కార్యాచరణ గురించి, మార్గదర్శకం చేసేవిధంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే ఏడాది కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరం అని లేఖలో జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.