నా గొంతు నొక్కగలరు కానీ ఓడించలేరు

రాజ్యసభ పదవి తొలగింపుపై రాఘవ్ చద్దా ఘాటు స్పందన

అక్షర ఆయుధం : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభలో తమ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దా స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై రాఘవ్ చద్దా స్పందించారు.ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభలో తమ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దా స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై రాఘవ్ చద్దా తాజాగా స్పందించారు. ఇందుకు సంబంధించి రాఘవ్ చద్దా శుక్రవారం రోజున తన ఎక్స్ అకౌంట్‌లో ఒక వీడియో పోస్టు చేశారు. తన గొంతు నొక్కబడిందని... కానీ ఓడిపోలేదని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీకి ఇదే తన సందేశం అనే క్యాప్షన్‌ను జత చేశారు.ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడైన రాఘవ్‌ చద్దాపై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. 2023 నుంచి రాజ్యసభలో ఉప నేతగా ఉన్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్ సచివాలయానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. రాజ్యసభలో తమ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాను ఆ పదవి నుంచి తొలగించాలని కోరింది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ కోటా నుంచి రాఘవ్ చద్దాకు మాట్లాడే సమయం కేటాయించవద్దని కూడా అభ్యర్థించింది. అలాగే రాజ్యసభలో తమ పార్టీ నూతన డిప్యూటీ లీడర్‌గా అశోక్ మిట్టల్ పేరును ప్రతిపాదించింది. ఈ నియమాకాన్ని వీలైనంత త్వరగా గుర్తించాలని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. ప్రస్తుతం రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది సభ్యులు ఉన్నారు, వీరిలో ఏడుగురు పంజాబ్ నుంచి, ముగ్గురు ఢిల్లీ నుంచి ఉన్నారు. రాఘవ్ చద్దా... పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. రాఘవ్... ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో కొనసాగుతున్నారు. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా వేగంగా ఎదిగారు. 2015లో డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం తర్వాత... రాఘవ్ చద్దా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పార్టీ ట్రెజరర్‌గా పనిచేశారు.2019 లోక్‌సభ ఎన్నికలలో రాఘవ్ చద్దా... దక్షిణ ఢిల్లీ నియోజవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి రమేష్ బిధూరి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో రాజేంద్ర నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ జల్ బోర్డుకు వైస్-ఛైర్మన్‌గా పనిచేశారు. ఇక, రాఘవ్ చద్దాను రాజ్యసభకు పంపించాలని ఆప్ అధిష్టానం నిర్ణయించడంతో 2022 మార్చిలో రాఘవ్ చద్దా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. తద్వారా రాఘవ్ చద్దా 33 ఏళ్ల వయసులో రాజ్యసభ ఎంపీ అయ్యారు.