లోక్‌సభలో సీఎం చంద్రబాబు ఘాటుగా

అమరావతే ఏపీకి ఏకైక రాజధాని!

సాక్షి డిజిటల్ న్యూస్ : లోక్‌సభలో ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపిన విషయంపై సీఎ చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని అన్నారు. ఎవరూ అంగుళం కూడా కదల్చలేరు అని చెప్పుకొచ్చారు. లోక్‌సభలో చట్టబద్దత బిల్లుకు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక అమరావతే ఏకైక రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎవరూ అంగుళం కూడా రాజధానిని కదల్చలేరని ఆయన అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందటంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి... ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని.. లోక్‌సభలో చట్టబద్దత బిల్లుకు ఆమోదం పొందటం ఆంధ్రులకు దక్కిన గౌరవమని సీఎం అన్నారు. బిల్లు ఆమోదంతో అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని తెలిపారు. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లుకు మద్దతు పలికిన పార్టీలకు రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. వైసీపీ పాలకులది మూడుముక్కలాట మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు మూడు ముక్కలాటతో విధ్వంసం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆక్షేపించారు. రాజధానికి చట్టబద్దత కల్పించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం పెడితే కనీసం శాసనసభ సమావేశాలకు కూడా ఆ పార్టీ హాజరు కాలేదని సీఎం మండిపడ్డారు.రాజధాని ప్రాంతాన్ని స్మశానమని, ఏడారి అని, ముంపు ప్రాంతమని ఎగతాళి చేసి ఆనందించారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చట్టబద్దత బిల్లుకు లోక్‌సభ ఆమోదం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్దత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు... అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతి చట్టబద్దత కల్పించాలనే తీర్మానానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్-5(2)ను సవరించి... ‘ఎట్ అమరావతి’ అనే పదాన్ని చట్టంలో చేర్చేలా అసెంబ్లీ తీర్మానించింది. శాసనసభ ఆమోదం పొందిన ఈ తీర్మానాన్ని అనంతరం కేంద్రం వద్దకు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తించే బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. బుధవారం రోజున లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026 కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఆమోదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించాలని కోరుతున్న ఈ బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌, వైసీపీ, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా లోక్‌సభలోని దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లుకు సంపూర్ణమద్దతు ప్రకటించాయి. అనంతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్‌ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్‌ ప్రకటించారు. ఇకపోతే ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఈ బిల్లు చట్టంగా రూపుదిద్దుకున్న తర్వాత 2024 జూన్ 2 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధమైన గుర్తింపు పొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇకపోతే ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దమైన హోదా కల్పించే విషయంలో లోక్‌సభలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఈ చట్టానికి పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత విభజిత ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సి ఉందని, ఆ హామీని నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల మాదిరిగా అమరావతి కూడా అభివృద్ధి చెందాలని ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఆకాంక్షించారు. అలాగే ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు పట్టణాలు సైతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి తాము మద్దతు ఇస్తున్నామని ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు.