
పయనించే సూర్యుడు న్యూస్ : భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన కిరోసిన్ పంపిణీకి ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇంధన ఆందోళనలు నెలకొన్న సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన కిరోసిన్ పంపిణీకి ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్ పంపులలో కిరోసిన్ పంపిణీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో కిరోసిన్ పంపిణీకి అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం... కిరోసిన్ రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని నిర్దేశిత పెట్రోల్ పంపులలో గృహ వినియోగం కోసం నాణ్యమైన కిరోసిన్ నూనెను నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి అనుమతించింది. ఈ నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నోటిఫికేషన్ చెల్లుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రతి జిల్లాల్లో గరిష్టంగా రెండు పెట్రోల్ బంక్ల ద్వారా కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. వీటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గుర్తించాల్సి ఉంటుంది. ప్రాధాన్యంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థల యాజమాన్యంలోని అవుట్లెట్లను ఎంపిక చేయనున్నారు. అలాగే, ప్రతి అవుట్లెట్ 5,000 లీటర్ల వరకు నిల్వ చేసేందుకు అనుమతించనున్నారు. వేగవంతమైన పంపిణీని సులభతరం చేయడానికి డీలర్లు, రవాణాదారులకు కొన్ని లైసెన్సింగ్ అవసరాల నుంచి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ మినహాయింపు ఇచ్చింది. అయితే భద్రత, పర్యవేక్షణ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. గృహాలలో వంట చేసుకోవడానికి, దీపాలు వెలిగించడానికి కోసం మాత్రమే ఈ కిరోసిన్ సరఫరా చేస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ విధంగా కిరోసిన్ పంపిణీని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్తో సహా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేయనున్నట్టుగా పేర్కొంది. ఇదిలాఉంటే, మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతల వేళ దేశంలో ఎల్పీజీ సిలిండర్లకు గానీ, ఇంధన సరఫరాకు గానీ కొరత ఉండదని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్ 2026కు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా టైమ్స్ నౌ, టైమ్స్ నౌ నవభారత్ గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ నవికా కుమార్ అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. 140 కోట్ల మంది ప్రజలు ఏకమైనప్పుడు... దేశం 140 కోట్ల ప్రగతి అడుగులు వేస్తుందని చెప్పారు. పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంపై స్పందిస్తూ... నేడు ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా భారత ప్రభుత్వం తన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించగలుగుతోందని తెలిపారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్లకు గానీ, ఇంధన సరఫరాకు గానీ కొరత ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం దేశానికి హామీ ఇచ్చారు. ఈ ప్రపంచ సంక్షోభ సమయంలో మోదీ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని ఆయన ప్రజలను కోరారు. దేశంలో లాక్డౌన్ ఉండదని హోం మంత్రి స్పష్టం చేశారు. కోవిడ్ మహమ్మారి సమయం మాదిరిగా ఆంక్షలను విధించే ప్రణాళిక లేదని అమిత్ షా పునరుద్ఘాటించారు. ‘‘లాక్డౌన్ ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు’’ అని అమిత్ షా పేర్కొన్నారు.