మోదీ సర్కార్‌పై నమ్మకం ఉంచండి

★ LPG, ఇంధన, లాక్‌డౌన్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : దేశంలో ఎల్పీజీ సిలిండర్లకు గానీ, ఇంధన సరఫరాకు గానీ కొరత ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం దేశానికి హామీ ఇచ్చారు. ఈ ప్రపంచ సంక్షోభ సమయంలో మోదీ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని దేశ ప్రజలను కోరారు. భారతదేశం 2047లో స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటికి వికసిత్ (అభివృద్ది చెందిన, ఆత్మ నిర్భర్ (స్వయం సమృద్ది) చెందిన దేశంగా అవతరిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అలాగే దేశంలో అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుందని తెలిపారు. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల వేళ దేశంలో ఎల్పీజీ సిలిండర్లకు గానీ, ఇంధన సరఫరాకు గానీ కొరత ఉండదని అమిత్ షా హామీ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న టైమ్స్ నౌ సమ్మిట్ 2026కు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ది టైమ్స్ గ్రూప్ ఎండీ వినీత్ జైన్ స్వాగతం పలికారు. అనంతరం ఈ వేదికపై టైమ్స్ నౌ, టైమ్స్ నౌ నవభారత్ గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ నవికా కుమార్‌‌ అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. 140 కోట్ల మంది ప్రజలు ఏకమైనప్పుడు... దేశం 140 కోట్ల ప్రగతి అడుగులు వేస్తుందని చెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంపై స్పందిస్తూ... నేడు ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా భారత ప్రభుత్వం తన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించగలుగుతోందని తెలిపారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి సంకల్పం వికసిత భారత్ (అభివృద్ది చెందిన భారతదేశం) నిర్మాణంతో ముడిపడి ఉందని... తద్వారా ప్రతి రంగంలోనూ అపూర్వమైన మార్పును మనం వీక్షించగలుగుతున్నామని అన్నారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్లకు గానీ, ఇంధన సరఫరాకు గానీ కొరత ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం దేశానికి హామీ ఇచ్చారు. ఈ ప్రపంచ సంక్షోభ సమయంలో మోదీ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని ఆయన ప్రజలను కోరారు. దేశంలో లాక్‌డౌన్ ఉండదని హోం మంత్రి స్పష్టం చేశారు. కోవిడ్ మహమ్మారి సమయం మాదిరిగా ఆంక్షలను విధించే ప్రణాళిక లేదని అమిత్ షా పునరుద్ఘాటించారు. ‘‘లాక్‌డౌన్ ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు’’ అని అమిత్ షా పేర్కొన్నారు. ఇంధన కొరత లేదు, సంక్షోభ ప్రభావాన్ని ప్రభుత్వం తట్టుకుంటోందని అమిత్ షా తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పటికీ... భారతదేశం స్థిరమైన ఇంధన సరఫరాలను, ధరలను కొనసాగించగలిగిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాలలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి పెరుగుదల లేకుండా సరఫరా చేస్తున్న ఏకైక దేశం భారతదేశం అని అమిత్ షా తెలిపారు. సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తీరుపై కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌పై వస్తున్న విమర్శలను అమిత్ షా తిప్పికొట్టారు. ప్రజలను ఆదుకోవడానికి కేంద్రమే ఆర్థిక భారాన్ని మోసిందని ఆయన అన్నారు. ‘‘సంక్షోభ భారం మొత్తం తనపై వేసుకున్న మరో దేశం ప్రపంచంలో లేదని నేను నమ్ముతున్నాను’’ అని అమిత్ షా పేర్కొన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ కారణంగానే ఈ రోజు భారత ప్రభుత్వం... పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించగలుగుతోందని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ప్రతిపక్షాల ప్రకటనలకు ప్రభావితం కావద్దని ప్రజలను కోరారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ‌పై నేరుగానే విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఏది చెప్పినా... దయచేసి దానిని నమ్మకండి అంటూ చమత్కరించారు. ‘‘నేను ప్రజలకు ఒక విషయం తెలియజేసేందుకు టైమ్స్ నౌ సమ్మిట్ వేదికను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను... ప్రపంచంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో మనం తప్పక అర్థం చేసుకోవాలి...ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా ధరలు పెరిగాయి... యూరప్‌లో 20-30 శాతం, పాకిస్తాన్‌లో 17-20 శాతం, కంబోడియా‌లో 19 శాతం, నైజీరియా‌లో 40-48 శాతం ధరలు పెరిగాయి. ధరల పెరుగుదల జీరో శాతంగా ఉన్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.