
పయనించే సూర్యుడు న్యూస్ : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడి ఘటనను ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఖండించారు. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. మతమార్పిడులు జరిగిన చోట.. పురాతన ఆలయాల ఉనికి ప్రశ్నార్థకమవుతుందా అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఇలాంటి దాడులకు పాల్పడేవారి కులధ్రువీకరణ పత్రాలను రద్దుచేయాలని ఆయన కోరారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రామాలయం ఘటనపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ స్పందించారు. పెద్దపేటలోని రామాలయం సందర్శనకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులపై దాడి జరగడం అత్యంత ఆందోళనకరమని మాధవ్ అభిప్రాయపడ్డారు. దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం, హింసకు దిగడం క్షమించరాని నేరమన్న ఆయన.. ఒక ప్రాంతంలో మత మార్పిడులు జరిగాయని చెబుతూ, ఆ ప్రాంతంలోని పురాతన హిందూ దేవాలయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మత మార్పిడుల వల్ల సంభవించే ప్రతికూల పరిణామాలకు ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనమని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. మత మార్పిడి జరిగితే ఆ ప్రాంత చరిత్ర, సంస్కృతి కూడా మారిపోతుందా అని ప్రశ్నించారు. పురాతన దేవాలయాల ఉనికి ప్రశ్నార్థకమవుతుందా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆకివీడు ఘటన ధర్మంపై నేరుగా జరిగిన దాడిగా అభివర్ణించిన మాధవ్ .. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఆకివీడు ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులకు భద్రత కల్పించాలని.. దేవాలయాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఇదే సమయంలో మరో కీలక ప్రతిపాదన ఏపీ బీజేపీ చీఫ్ తెరపైకి తెచ్చారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రయోజనాలను అనుభవించటానికి పేర్కొన్న మతం.. పాటించటానికి మాత్రం ఎందుకు అడ్డం వస్తోందని ప్రశ్నించారు. మతం మారినప్పటికీ చట్టవిరుద్ధంగా ప్రయోజనాలు పొందటంతో పాటుగా, సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా దాడులకు పాల్పడుతున్న వారి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రద్దు చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. అలాగే అలాంటి ధ్రువీకరణ పత్రాలను జారీ చేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ చీఫ్ కోరారు.మరోవైపు ఆకివీడు ఘటనలో తీవ్రంగా గాయపడి భీమవరం ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ స్పీకర్ రఘురామ పరామర్శించారు. గాయపడిన వారిలో ఒక వ్యక్తికి తలలో మేకు గుచ్చుకుందని.. మరొక వ్యక్తి సుమారు 12 కత్తి పోట్లకు గురయ్యారని రఘురామ తెలిపారు. ఇటువంటి అరాచకాలను ఆదిలోనే ఆపాలని కోరారు. హిందువుల పండుగ రోజున, దేవాలయంలో హిందువులపై ఈ దాడులు చేయించిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు.