భారత్.. పాకిస్థాన్ లాంటి ‘బ్రోకర్ దేశం’ కాదు..

ఇరాన్ మధ్యవర్తిత్వంపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు

సాక్షి డిజిటల్ న్యూస్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు దాయాది వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇటు అమెరికా, అటు ఇరాన్‌తో దానికి ఉన్న పరిచయాల నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధం అయింది పాకిస్థాన్. అయితే, ఈ చర్యలపై భారత్ తీవ్ర పదజాలంతో ఎగతాళి చేసింది. ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో పాకిస్థాన్‌ ఓ బ్రోకర్ దేశమని, భారత్ అలాంటిది కాదని కేంద్ర మంత్రి జై శంకర్ అన్నారు. అంతర్జాతీయ దౌత్యంలో తనకంటూ ఓ పాత్ర కోసం పాకులాడుతున్న పాకిస్థాన్.. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంలో ఇరాన్, అమెరికా చర్చలకు మధ్యవర్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని భారత్ ఎద్దేవా చేసింది. పాకిస్థాన్ మాదిరిగా మనది బ్రోకర్ దేశం కాదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా యుద్ధంపై ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఇస్లామాబాద్ ఓ బ్రోకర్ అని అభివర్ణిస్తూ ఆయన తీవ్రంగా విమర్శించారని పేర్కొన్నాయి. ‘పాకిస్థాన్ మాదిరిగా భారత్ మధ్యవర్తిత్వం, బ్రోకర్ పనులు చేయదు’ అని జైశంకర్ అన్నట్టు వివరించాయి. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేలా వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి పాకిస్థాన్ ముందుకొచ్చింది. సంఘర్షణకు పరిష్కార మార్గం సుగమం చేయాలనే తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేయడంతో రహస్య దౌత్యంపై ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అమెరికా, పాక్‌ల మధ్య సంప్రదింపుల కోసమే ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీలో ప్రత్యేకంగా 'ఆసక్తుల విభాగం'ను నిర్వహిస్తోందని, దాయాది 1981 నుంచి ఈ పని చేస్తోందని ఒక మూలం తెలిపింది. వాషింగ్టన్, ఇస్లామాబాద్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల కారణంగానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభాన్ని తాము నిర్వహించిన తీరును కూడా ప్రభుత్వం సమర్థించుకుందని వారు తెలిపారు. ఇరాన్‌పై దాడులను ఖండించకపోవడం, విధానపరమైన అస్పష్టతపై వస్తున్న విమర్శలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రకటనలు, దౌత్యపరమైన సంప్రదింపులు, సంబంధిత వర్గాలన్నిటితో చర్చల ద్వారా భారత్ ఈ విషయంలో నిమగ్నమై ఉందని పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు వివరించాయి. అంతేకాదు, యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకూ గల్ఫ్ దేశాల నుంచి 4.25 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్టు అఖిలపక్ష సమావేశంలో చెప్పినట్టు తెలుస్తోంది. యుద్ధ భూమిలో చిక్కుకున్న మిగతా భారతీయుల భద్రత, వారిని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఉద్ఘాటించింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు 15 ఏళ్లకు పైగా అమల్లో ఉన్నప్పటికీ, ఆ దేశం నుంచి చమురు కొనుగోలు భారత్ కొనసాగిస్తోందని కూడా ప్రభుత్వం నొక్కిచెప్పినట్టు వారు తెలిపారు.