
జనం న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఢిల్లీలో నీతులు. రాష్ట్రంలో మాత్రం అడ్డగోలుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంది అని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని మండిపడ్డారు. తెలంగాణలో రెండేళ్లు దాటినా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏది? ఇది రాజ్యాంగ శూన్యత కాదా? అని మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెబుతూ రాష్ట్రాల్లో మాత్రం అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ తీరును మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తప్పుపట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరడం, అగౌరవపరచడంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలన్నారు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఏడేళ్లుగా ఖాళీగా ఉంచడాన్ని రాజ్యాంగ శూన్యత అని పీఏసీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన చెప్పిన మాటలు నిజమే కావచ్చు, కానీ అదే సూత్రం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తించదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ఎందుకు భర్తీ చేయడం లేదు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావస్తున్నా.. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఎందుకు భర్తీ చేయడం లేదని మాజీమంత్రి హరీశ్ రావు నిలదీశారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొంతు చించుకునే కేసీ వేణుగోపాల్ , రాహుల్ గాంధీలు తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై ఏం సమాధానం చెబుతారు... ఇది రాజ్యాంగ శూన్యత కాదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ విలువల గురించి ఢిల్లీలో నీతులు చెప్పే కాంగ్రెస్, తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాల్లో వ్యవస్థలను ఖూనీ చేస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలనే కాంగ్రెస్ కూడా తెలంగాణలో రిపీట్ చేస్తోందని, ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో పోటీ పడుతున్నాయని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. రాజ్యాంగబద్దమైన పదవులను భర్తీ చేయడం లేదు. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట. లేనప్పుడు మరో మాట మాట్లాడటం కాంగ్రెస్ నైజమన్న హరీశ్ రావు, ఈ దొంగ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అధికార దాహంతో ఈ రెండు పార్టీలు రాజ్యాంగాన్ని అగౌరవపరచడం అత్యంత సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, రాజ్యాంగబద్ధమైన పదవులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.