రష్యా నుంచి చమురు కొనుగోలుపై చర్చ

భారత్‌కు నిజంగా అనుమతులు అవసరమా?

సాక్షి డిజిటల్ న్యూస్ : ఇరాన్ యుద్దం నేపథ్యంలో భారత్‌కు రష్యా నుండి చమురు దిగుమతి చేసుకునేందుకు అనుమతులు లభించాయి. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితిని తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా ముడి చమురు కొనుగోళ్లకు అనుమతిస్తూ భారతదేశానికి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ , ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణ, హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో చమురు ధరలను స్థిరీకరించడానికి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన ముడి చమురు అవసరాలలో దాదాపు 90% దిగుమతి చేసుకునే ఇండియాకు, ఈ నిర్ణయం ఇంధన భద్రతపై గణనీయమైన ప్రభావాలను చూపుతుంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ భారత రిఫైనరీలు రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు తాత్కాలికంగా 30 రోజుల మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుండి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు నెల రోజుల పాటు తాత్కాలిక వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులను అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (OFAC) జారీ చేసింది. నిజంగా భారత్‌కు అనుమతులు అవసరమా? రష్యా నుండి చమురు కొనేందుకు ఇండియాకు అనుమతులు లభించిన అంశంపై ప్రతిపక్షనేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, రష్యా నుండి చమురు కొనాలంటే వాషింగ్‌టన్‌ నుండి అనుమతులు పొందాలని విమర్శలు చేశారు. అయితే ఫిబ్రవరి 2026 నాటికి భారత్‌కు, రష్యా నుండే ఎక్కువగా చమరు సరఫరా జరుగుతుందని , భారతదేశానికి చెందిన రీఫైనరీలు రోజుకు సుమారుగా 1.0 నుండి 1.7 మిలియన్ బ్యారెల్స్ రష్యన్ క్రూడ్ ఆయిల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది భారత్ దిగుమతి చేసుకునే చమురు నిల్వల్లో 25 నుండి 30 శాతంగా ఉంది. ఒక నెలలో సుమారుగా 28 నుండి 48 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి జరుగుతుంది. ఇండియా, రష్యా దేశం నుండి సుమారుగా 10 లక్షల బ్యారెల్స్ చమురును దిగుమతి చేసుకుంటుందని. ఒక వేళ చమురు దిగుమతులకు నిజంగా అనుమతులు కావాల్సి ఉంటే, భారత్‌ ఇంత మొత్తంలో దిగుమతులు చేసుకునేది కాదని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారతదేశం సముద్రం ద్వారా రష్యన్ ముడి చమురును ఎక్కువగా కొనుగోలు చేసే దేశంగా మారింది. కానీ ఆ తర్వాత కొనుగోళ్లు తగ్గడం ప్రారంభించాయి. ట్రంప్ ప్రభుత్వం గతంలో భారతదేశంపై రష్యా ముడి చమురు కొనుగోలుకు సంబంధించి 25 శాతం పెనాల్టీ టారిఫ్‌ను విధించింది. అనంతరం మిడిల్ ఈస్ట్ నుంచి చమురును కొనుగోలు చేస్తోంది. భారత్ తన చమురు అవసరాల్లో 40 శాతం మిడిల్ ఈస్ట్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హర్మూ జ్ జలసంధిని మూసి వేసారు, దీంతో చమురు కొరత ఏర్పడింది. ఒకవేళ చమురు సరఫరా పూర్తిస్థాయిలో నిలిచిపోతే దేశీయంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో రష్యా చమురు కొనుగోళ్లకు అమెరికా అనుమతి ఇవ్వడం భారత్‌కు పెద్ద ప్లస్ కానుంది. రోస్నెఫ్ట్ , లుకోయిల్ వంటి ప్రధాన రష్యన్ ఉత్పత్తిదారులపై ఆంక్షలు విధించిన తరువాత, భారతీయ రీఫైనరీలు క్రమంగా తమ కొనుగోళ్లను తగ్గించుకున్నాయి. ఇది అమెరికాతో వాణిజ్య ఒప్పందం వైపు పురోగతిని సులభతరం చేసింది, దీని కింద భారత ఎగుమతులపై సుంకాలు తగ్గించబడ్డాయి.