ఏపీలో తల్లిదండ్రులకు బంపరాఫర్: మూడో సంతానానికి రూ.25వేలు కానుక

పోషణకు ఏడాదికి రూ.12వేలు, 12 నెలల పేరెంట్ లీవ్

సాక్షి డిజిటల్ న్యూస్ : ఏపీ జనాభా 5 కోట్లకు తగ్గకుండా నిర్వహిస్తేనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా నిలుస్తుంది అని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ‘మూడో సంతానానికి ‘పోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ ఇస్తాం. మూడో సంతానానికి డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకంగా ఇవ్వడంతో పాటు 5 సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం’అని సీఎం ప్రకటించారు. మూడో సంతానం, ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్ - తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం అని సీఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర జనాభా పెంచడమే లక్ష్యంగా తల్లిదండ్రులకు బంపరాఫర్లు ప్రకటించింది. ఇప్పటికే ఇద్దరు బిడ్డలు దాటితే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా మూడో బిడ్డకు భారీ ఆఫర్లు ప్రకటించింది. మూడో సంతానానికి డెలివరీ సమయంలో రూ.25వేలు ప్రోత్సాహంగా ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. జనాభా నిర్వహణ పై డ్రాఫ్ట్ పాలసీపై శాసనసభలో గురువారం ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అంతేకాదు ఐదు సంవత్సరాలపాటు నెలకు పోషణ కింద రూ.1000 సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం అని ప్రకటించారు. మూడో సంతానం ఆపై జననాలకు 12 నెలల పేరెంట్ లీవ్..తల్లిదండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏప్రిల్ నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇన్నాళ్లూ ఫ్యామిలీ ప్లానింగ్‌కి ప్రాధాన్యత ఇచ్చామని...ఇకపై ‘పాపులేషన్ కేర్’ పై దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏపీలో ప్రస్తుతం టోటల్ ఫెర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) 1.5గా ఉందని, దీనిని 2.1కి పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని, భారతదేశంలోనూ ముఖ్యంగా ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందని సీఎం అన్నారు. 1992-93లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఎఫ్ఆర్ 3.0గా ఉండేదని గుర్తు చేశారు. టీఎఫ్ఆర్ మరింత వేగంగా తగ్గితే వర్క్ ఫోర్స్ పడిపోతుందని... దీంతో ఆర్థిక వృద్ధి మందగిస్తుందని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మరింత నష్టం వాటిల్లుతుందనే ఆలోచనతో ఈ డ్రాఫ్ట్ పాలసీకి రూపకల్పన చేశామని వివరించారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో కేవలం ఏడాదికి 6.70 లక్షల జననాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇది ఇలాగే కొనసాగితే 2047 నాటికి రాష్ట్ర జనాభాలో 23 శాతం మంది వృద్ధులే ఉంటారని చెప్పారు. ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్’ పాలసీ డాక్యుమెంట్ అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌లో పెడుతున్నట్టు సీఎం ప్రకటించారు. దీనిపై రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో నెల రోజుల పాటు ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఈ అంశంపై చర్చ నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతీ నెల నాలుగో శనివారం జనాభా నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీకి తుది రూపు ఇచ్చి, ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామన్నారు. ఏడాది తర్వాత ఫలితాలు పరిశీలించి పాలసీలో మార్పులు చేర్పులు చేస్తామని వెల్లడించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ అనేది పాపులేషన్ మేనేజ్‌మెంట్‌తోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని ఈ ఐదు పాపులేషన్ మేనేజ్‌మెంట్‌కు మూలస్తంభాలన్నారు. మహిళల వర్క్ ఫోర్స్‌ పెరిగితే జీఎస్డీపీ వృద్ధి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘మహిళల వర్క్ ఫోర్స్ ప్రస్తుతం కేవలం 31 శాతం మాత్రమే ఉంది. ఇది 59 శాతాన్ని చేరుకుంటే రాష్ట్ర జీఎస్డీపీ 15 శాతం పెరుగుతుంది. గర్భధారణ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి జీవిత దశలోనూ ప్రభుత్వ మద్దతు ఉంటుంది. పిల్లలు లేక, ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతిస్తాం. మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వాసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలు పీపీపీ విధానంలో అందిస్తాం. సిజేరియన్లు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే, ప్రస్తుతం 8.8 శాతం ఉన్న టీనేజ్ గర్భధారణలను 3 శాతం లోపు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 50 మంది చిన్నారులు, మహిళలు ఒక ప్రాంతంలో ఉంటే చైల్డ్ కేర్ సెంటర్లు, పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాం. షి క్యాబ్‌లు అందుబాటులోకి తెస్తాం. విశాఖపట్నంలో రూ.172 కోట్లతో వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌ నిర్మాణం చేపట్టాం. ఏ ప్రాంతంలో మహిళా ఉద్యోగులు పనిచేస్తారో అక్కడ కొత్తగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మూడో సంతానం, ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్ - తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం. మూడో సంతానానికి ‘పోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ ఇస్తాం. మూడో సంతానానికి డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకంగా ఇవ్వడంతో పాటు 5 సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం. త్వరలో ‘తల్లి దండ్రుల సమాన బాధ్యత’ పేరుతో కుటుంబ బాధ్యతలు పంచుకోవడంపై అవగాహన క్యాంపెయిన్ చేపడతాం. చైల్డ్ కేర్టేకర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం.’ అన్నారు.